సిడ్నీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. 2022 సీజనే తనకు చివరిదని ఈ హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ ప్రకటించింది. ఈ సీజన్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకతానని పేర్కొంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్లో ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచ్నోక్తో జోడీ కట్టిన సానియాకు చుక్కెదురైంది. తొలి రౌండ్లోనే స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్సెక్-కాజా జువాన్ జోడీ 4-6, 6-7(5) చేతిలో సానియా ద్వయం ఓటమిపాలైంది.
ఈ ఓటమి తర్వాతే సానియా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. 'ఇదే నా చివరి సీజన్ అని నిర్ణయించుకున్నాను. నేను ఒక వారం నుంచి ఈ టోర్నీలో ఆడుతున్నా. ఈ సీజన్ మొత్తం ఆడగలనో లేదో తెలియదు. కానీ నేను మొత్తం సీజన్లో ఉండాలనుకుంటున్నాను" అని సానియా తెలిపింది.సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగనుంది.
2013లోనే సింగిల్స్ ఆడటం మానేసిన సానియా డబుల్స్లో అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ను కూడా అందుకుంది. దాదాపు 91 వారాలా పాటు నంబర్వన్గా కొనసాగింది. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 270 ప్లస్ సింగిల్స్ విజయాలందుకున్న హైదరాబాద్ ప్లేయర్.. డబుల్స్లో 500 ప్లస్ విక్టరీలు నమోదు చేసింది. సింగిల్స్లో సానియా అత్యుత్తమ ర్యాంక్ 27 కాగా.. డబుల్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక సింగిల్స్ టైటిల్తో పాటు 40 డబుల్స్ టైటిల్స్, 6 గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలుపొందింది. రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో సానియా 14 పతకాలను సాధించింది. అందులో 6 బంగారు పతకాలున్నాయి.
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకున్న సానియా.. 2018లో కొడుకుకు జన్మనించింది. దాంతో రెండేళ్ల పాటు మైదానానికి దూరమైంది. ఆ తర్వాత రీఎంట్రీ ఇవ్వడానికి తీవ్ర కసరత్తులు చేసిన సానియా.. దాదాపు 26 కిలోల బరువు తగ్గింది. రీఎంట్రీలో ఉక్రెయిన్కు చెందిన నదియా కిచెనోక్తో కలిసి హోబర్ట్ ఇంటర్నేషనల్లో మహిళల డబుల్స్ టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత టోక్యో ఒలింపిక్స్ 2020లో కూడా బరిలోకి దిగింది. కానీ ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.