టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ 13వ రోజుకు చేరుకుంది. జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఈ అత్యుత్తమ క్రీడా వేదికలో భారత అథ్లెట్లు తమ పతకాల వేటలో పడ్డారు. 13వ రోజు పలు చిరస్మరణీయమైన విజయాలను భారత తన ఖాతాలో వేసుకుంది. పురుషుల జావెలిన్ థ్రో గ్రూప్ బీ విభాగంలో శివ్పాల్ సింగ్, మహిళా రెజ్లర్ అన్షు మలిక్ నిరాశ పరిచినప్పటికీ.. మరిన్ని ఈవెంట్లలో భారత్ పతకానికి చేరువగా వెళ్లడం కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గ్రూప్ ఏ జావెలిన్ థ్రో విభాగంలో నీరజ్ చోప్రా భారత్ను ఫైనల్స్కు చేర్చాడు. జావెలిన్ థ్రో క్వాలిఫికేషన్స్లో మొదటి స్థానంలో నిలిచాడు. 7వ తేదీన అతను ఫైనల్స్లో పోటీ పడనున్నాడు.
ఆ రికార్డ్కు ఒక్క విజయం దూరంలో విరాట్ కోహ్లీ: టెస్ట్ సిరీస్తో ఆ దాహం తీరినట్టే..
బాక్సింగ్లో ఇప్పటికే రజత పతకాన్ని ఖాయం చేసుకున్న అస్సామీ యువతి లవ్లీనా బొర్గోహెయిన్.. పసిడి పతకంపై ఫోకస్ పెట్టారు. మహిళల హాకీ జట్టు కూడా పతకం రేసులో నిలిచింది. పతకాన్ని ఖాయం చేసుకోవడానికి ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే చాలా. ఒకరకంగా ఒలింపిక్స్లో భారత్కు ఇది చారిత్రత్మక దినంగా మారినట్టయింది. భారత కుస్తీ వీరుడు రవి కుమార్ దహియా తన ప్రత్యర్థులపై విరుచుకుని పడ్డాడు. బ్యాక్ అండ్ బ్యాక్ బౌట్స్లో రెచ్చిపోయాడు. వారిని మట్టి కరిపించాడు. పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ విభాగంలో తొలుత అతను 1/8 ఫైనల్ రౌండ్లో నైజీరియాకు చెందిన ఎకెెరెకెమె అగియోమోర్ను చిత్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్స్లో అడుగు పెట్టాడు.
అక్కడ కూడా అతనికి ఎదురు లేకుండా పోయింది. ఈ క్వార్టర్ ఫైనల్స్లో రవి దహియా.. బల్గేరియాకు చెందిన జార్గీ వెంగెలోవ్కు పరాజయాన్ని రుచి చూపించాడు. సుడిగాలిలా విజృంభించాడు. 14-4 తేడాతో క్వార్టర్స్ ఫైనల్స్ను గెలిచాడు రవి దహియా.. దర్జాగా సెమీ ఫైనల్స్లోకి అడుగు పెట్టాడు. అదే సమయంలో మహిళా రెజ్లర్ అన్షు మలిక్ నిరాశపరిచారు. మహిళల 57 కేజీల రెజ్లింగ్ 1/8 ఫైనల్ రౌండ్లో ఆమె ఓడిపోయారు. ఈ రౌండ్లో బెలారస్కు చెందిన ఇరైనా కురచ్కిన్ చేతిలో 8-2 తేడాతో ఓటమి చవి చూశారు. దీనికి పూర్తి భిన్నంగా రవి కుమార్ దహియా బౌట్ కొనసాగింది.
క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్లో ప్రత్యర్థులపై ఏకపక్షంగా విజయాన్ని సాధించాడతను. పురుషుల 57 కేజీల రెజ్లింగ్ క్వార్టర్ ఫైనల్స్లో రవికుమార్ దహియా జార్గీ వెంగెలొవ్ను ఓడించాడు. మరోవంక దీపక్ పునియా కూడా సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించాడు. 86 కేజీల ఫ్రీస్టైల్ పురుషుల విభాగంలో అతను చైనాకు చెందిన లిన్ ఝుషెన్ను చిత్తు చేశాడు దీపక్. ఈ రెండు ఈవెంట్లు కూడా పతకాలపై ఆశలను రేకెత్తించేలా చేశాయి. క్వార్టర్ ఫైనల్స్ గండాన్ని దాటుకుని వారిద్దరూ సెమీ ఫైనల్స్లోకి అడుగు పెట్టడం ఉత్సాహాన్ని ఇస్తోంది. ఏ ఒక్కరైనా సెమీస్లో గెలిస్తే పతకం ఖాయమౌతుంది.