న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పౌర పురస్కారాల్లో ఏడుగురు క్రీడాకారులకు ప్రతిష్టాత్మక పౌర పురస్కారం 'పద్మశ్రీ' వరించింది. ఈ జాబితాలో స్టీపుల్చేజ్ అథ్లెట్ సుధా సింగ్ (ఉత్తరప్రదేశ్), వెటరన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మౌమా దాస్ (పశ్చిమ బెంగాల్), అనిత పాల్దురై (తమిళనాడు-బాస్కెట్బాల్), వీరేందర్ సింగ్ (హరియాణా-బధిర రెజ్లర్), మాధవన్ నంబియార్ (కేరళ-దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష కోచ్), కేవై వెంకటేశ్ (కర్ణాటక-పారాథ్లెట్), అన్షు జమ్సెన్పా (పర్వతారోహకురాలు-అరుణాచల్ ప్రదేశ్) ఉన్నారు.
34 ఏళ్ల సుధా సింగ్ 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో, 2017 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 3000 మీటర్ల స్టీపుల్చేజ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన సుధా సింగ్ 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లోనూ బరిలోకి దిగింది. బెంగాల్కు చెందిన 36 ఏళ్ల మౌమా దాస్ 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో మహిళల టేబుల్ టెన్నిస్ టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్ విభాగంలో రజతం సాధించింది. భారత్ తరఫున అత్యధికంగా 17 సార్లు ప్రపంచ చాంపియన్షిప్లలో ఆమె బరిలోకి దిగింది. చెన్నైకి చెందిన 35 ఏళ్ల అనిత పాల్దురై భారత మహిళల బాస్కెట్బాల్ జట్టుకు ఎనిమిదేళ్లపాటు కెప్టెన్గా వ్యవహరించింది. హరియాణాకు చెందిన 34 ఏళ్ల వీరేందర్ సింగ్ 2005, 2013, 2017 బధిర ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు స్వర్ణ పతకాలు అందించాడు.
41 ఏళ్ల అన్షు-మౌంట్ ఎవరెస్ట్ను రెండు సార్లు అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. 2011లో ఐదు రోజుల వ్యవధిలోనే ఆమె ఈ ఘనత సాధించింది. ఈసారి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డుల్లో స్పోర్ట్స్ పర్సన్స్కు చోటు దక్కలేదు. గతానికి భిన్నంగా పెద్దగా ఆదరణకు నోచుకోలేని ప్రతిభావంతులకు గవర్నమెంట్ గుర్తింపునివ్వడం విశేషం. ఈ ఏడుగురు 34 ఏళ్ల పైబడిన వాళ్లే కావడం గమనార్హం.