టోక్యో: స్వర్ణ ఆశలు రేకెత్తించిన భారత స్టార్ రెజ్లర్ రవికుమార్ దహియా కీలక ఫైనల్లో తీవ్రంగా నిరాశపరిచాడు. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీ స్టైల్ ఫైనల్లో నాలుగో సీడ్ రవి దహియా 4-7 తేడాతో రష్యా ఒలింపిక్స్ కమిటీ అథ్లెట్ జవర్ ఉగువే చేతిలో ఓటమిపాలయ్యాడు. దాంతో రవి దహియాకు రజత పతకం వరిచింది. సుశీల్ కుమార్ తర్వాత సిల్వర్ మెడల్ గెలిచిన రెండో రెజ్లర్గా.. ఓవరాల్గా భారత్ తరఫున మెడల్ సాధించిన ఐదో రెజ్లర్గా నిలిచాడు. 1952 ఒలింపిక్స్లో కేడీ జాదవ్ భారత్కు బ్రాంజ్ మెడల్ అందించగా.. సుశీల్ కుమార్ 2008లో కాంస్యం, 2012లో రజత పతకం అందించాడు. 2008లో యోగేశ్వర్ దత్ కాంస్యం అందించాడు. 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్ కాంస్యం అందించింది.
సెమీఫైనల్లో తనదైన ఆటతో చివరి నిమిషంతో ప్రత్యర్థిని మట్టికరిపించిన రవి దహియా ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. ప్రత్యర్థి రెజ్లర్ పట్టుచిక్కనివ్వకపోవడంతో వెనుకబడ్డాడు. ఆది నుంచే రష్యా రెజ్లర్ ఉడుం పట్టి ఆధిక్యం సాధించాడు. రష్యా రెజ్లర్కే తొలి పాయింట్ దక్కగా.. అదే జోరులో మరో పాయింట్ సాధించి 0-2తో లీడ్లోకి వెళ్లాడు. ఈ క్రమంలో పుంజుకున్న రవి దహియా రెండు పాయింట్లు సాధించి స్కోర్ను 2-2 సమం చేశాడు. ఆ తర్వాత మరింత దూకుడు కనబర్చి రెండు పాయింట్లో లీడ్ను డబుల్ చేశాడు. దాంతో ఫస్ట్ పీరియడ్ 2-4తో ముగిసింది.
ఇక సెకండ్ పీరియడ్లో ఇద్దరు హోరా హోరీగా తలపడ్డారు. ఇద్దరు మ్యాట్ బయటకు రావడంతో రిఫరీ పాయింట్స్ ఇవ్వలేదు. ఆ తర్వాత రష్యా ప్లేయర్ వరుస పాయింట్లతో తన ఆధిక్యాన్ని 7-2తో పెంచుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చడంతో రవికుమార్ డిఫెన్స్కే పరిమితమయ్యాడు. తర్వాత రెండు పాయింట్లు సాధించినా.. ప్రత్యర్థి పట్టుచిక్కనివ్వకపోవడంతో రవికుమార్కు ఓటమి తప్పలేదు.
రవికుమార్ రజత పతకంతో టోక్యో ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను రజతం గెలవగా.. భారత పురుషుల హాకీ టీమ్తో సహా పీవీ సింధు, లవ్లీనాతో కాంస్య పతకాలు అందుకున్నారు.