న్యూఢిల్లీ: కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగాక్రీడలకు ప్రేక్షకులను అనుమతించట్లేదని ప్రకటించారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒలింపిక్ మినిస్టర్ తమయో మరుకవా స్పష్టం చేశారు. టీవీల్లోనే ఈ మెగాక్రీడలను చూడాలని ప్రేక్షకులకు సూచించారు. టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు ఒలింపిక్స్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పాడు. ఈ పరిస్థితికి చింతిస్తున్నామని తెలిపాడు.
అంతకుముందే అతిథ్య నగరంలో కేసులు అదుపు చేసేందుకు జపాన్ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది . ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే టోక్యోలో ఎమెర్జన్సీ విధిస్తున్నట్లు జపాన్ ప్రధాని యొషిహిదె సుగా ప్రకటించారు. విజయోత్సవాలతో పాటు మద్యం అమ్మకాలపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్ పూర్తయ్యేవరకు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని తెలిపారు.
ఒలింపిక్స్ జరగనున్న టోక్యోలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నగరంలో బుధవారం ఒక్కరోజే 920 కొత్త కేసులు వచ్చాయి. మే తర్వాత ఇవే హయ్యెస్ట్ కావడంతో జపాన్ ప్రభుత్వం, టోక్యో ఆర్గనైజర్స్ కంగారు పడ్డారు. ఈ క్రమంలో మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన జపాన్ ప్రధాని.. వైరస్ కట్టడికి ఎమర్జన్సీ విధిస్తూ కీలకం నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి క్రీడాకారులను రప్పించి.. మధ్యలో ఒలింపిక్స్ ఆపేయాల్సి వస్తే జపాన్కు, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్కు అంతకంటే ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. దీని వల్ల కలిగే నష్టం కూడా రూ. లక్షల కోట్లలో ఉంటుంది. అందుకే ఒలింపిక్స్ సమయంలో నిబంధనలు కఠినతరం చేయాలని నిర్వాహకులు భావించారు.
అంతకుముందు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రేక్షకులపై నిషేధం విధించిన నిర్వాహకులు.. స్టేడియం సామర్థ్యంలో 50 శాతం వరకు సుమారు 10వేల మంది స్థానిక ప్రేక్షకులను అనుమతిస్తామని కొన్ని వారాల కింద ప్రకటించారు. కానీ జపాన్లో కొవిడ్ కేసులు వరుసగా పెరుగుతుండడంతో ప్రేక్షుకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించడం ఉత్తమమని తుది నిర్ణయం తీసుకున్నారు.