హైదరాబాద్: కరోనాతో ఏడాది ఆలస్యమైనా.. అనుకోని సవాళ్లు ఎదురైనా.. మొక్కవోని ధైర్యంతో.. నిండైన ఆత్మవిశ్వాసంతో టోక్యో ఒలింపిక్స్ -2020 ఆరంభమయ్యాయి. ఉత్సాహం ఉరిమేలా.. గెలుపు కాంక్ష రగిలేలా.. కష్టాలు కడలిలో కలిసేలా.. ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చేలా.. అగాధానికి, ఆశకు మధ్య వారధిగా నిలిచేలా.. లోకమంతా ఎదురు చూసిన విశ్వక్రీడలకు గత శుక్రవారం తెరలేసింది. ఆటగాళ్ల పతకాల మోత మోగుతుంది. టోక్యోలో తొలి స్వర్ణం పతకం అందుకున్న చైనా షూటర్ యాంగ్ కియాన్ నుంచి 20 ఏళ్ల కలను సాకారం చేస్తూ భారత ఖాతా తెరిచిన మీరాబాయి చాను, సోమవారం స్విమ్మింగ్లో స్వర్ణం సాధించిన ఫిలిప్పిన్స్, బెర్ముడా అథ్లెట్ల వరకు అందరూ తమ అశయాలను నెరవేర్చుకున్నారు.
అయితే ఒలింపిక్స్ విజేతలు తమ మెడలోని మెడల్స్ ను కొరుకుతూ, చిరునవ్వులు చిందిస్తూ కెమెరాలకు ఫోజులిస్తుంటారు. ముఖ్యంగా గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులైతే తప్పనిసరిగా ఈ పోజ్ లో కనపడతారు. స్విమ్మింగ్ రికార్డు బ్రేకర్ మైఖేల్ ఫెల్ప్స్ నుంచి జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ సిమోన్ బైల్స్... ఇలా స్వర్ణ పతక విజేతలు ఈ విధంగా తమ మెడల్స్ ను కొరికినవారే. వాటిని ఎందుకు కొరుకుతారనే అనుమానం అభిమానులకు రాక మానదు.
క్రీడా విజేతలు ఆ విధంగా చేయడానికి కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అసలైన దానిని తాము సాధించామని చెప్పడానికి గాను చాలా కాలంగా ఈ పద్ధతిని క్రీడాకారులు అనుసరిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ చెప్పిన దాని ప్రకారం, పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజ్ లివ్వరని, ఫొటో గ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్ ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా మెడల్స్ కొరకడంపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. గోల్డ్ మెడల్ గెలుచుకున్న అథ్లెట్ మెడల్ ను కొరుకుతున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేసి..'ఇవి తినే మెడల్స్ కావని అధికారికంగా ప్రకటిస్తున్నాం. ఈ మెడల్స్ జపాన్ ప్రజలు విరాళంగా ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసిన తయారు చేశాం. అందుకే వాటిని కొరకవద్దని చెబుతున్నాం. అయినా వాటిని కొరకాలనుకుంటే నాలుకతో టేస్ట్ చేసి చూడండి.'అని ట్వీట్ చేసింది. దీనికి #UnitedByEmotion అనే హ్యాష్ ట్యాగ్ను జత చేసింది