లవ్లీనా విజయం
మంగళవారం చెప్పుకోదగిన విజయం ఏదైనా ఉందంటే అది తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన బాక్సర్ లవ్లీనా విజయమే. మహిళల వెల్టర్వెయిట్( 64-69 కేజీల) విభాగం రౌండ్ ఆఫ్ 32లో బై లభించడంతో ఈమె నేరుగా మంగళవారం జరిగిన రౌండ్ ఆఫ్ 16లో తలపడింది. జర్మనీ బాక్సర్ నదైన్ అపెట్జ్పై 3-2తో విజయం సాధించింది. ఆమె క్వార్టర్ఫైనల్లో గెలిస్తే చాలు సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో పతకం ఖాయం. బాక్సింగ్లో సెమీస్లో ఓడిన ఇద్దరికీ బ్రాంజ్ మెడల్ ఇస్తారు. క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా బలమైన చైనీస్ తైపేకి చెందిన నియెన్-చిన్ చెన్తో తలపడాల్సి ఉంది.
పురుషుల హాకీ సూపర్ విక్టరీ..
వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రేలియా చేతిలో 1-7తో చిత్తు చిత్తుగా ఓడిన టీమిండియా.. మళ్లీ విజయాల బాట పట్టింది. మంగళవారం ఉదయం స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో 3-0తో గెలిచింది. మ్యాచ్ మొత్తం మన్ప్రీత్ సింగ్ సేన ఆధిపత్యం ప్రదర్శించింది. గురువారం ఒలింపిక్ చాంపియన్స్ అర్జెంటీనాతో టీమిండియా తలపడనుంది. భారత్ తరఫున సిమ్రన్జీత్ సింగ్ (14వ నిమిషం), రూపిందర్పాల్ సింగ్ (15ని, 51ని) గోల్స్ చేశారు.
మూడింటిలో విఫలం..
షూటింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింట్లో భారత్కు నిరాశే ఎదురైంది. మంగళవారం జరిగిన రెండు మెడల్ ఈవెంట్లలోనూ భారత షూటర్లు ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు.10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్, సౌరభ్ చౌదరి జోడీతోపాటు అభిషేక్ వర్మ, యశస్విని దేశ్వాల్ విఫలమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లోనూ దివ్యాంశ్ పన్వర్, ఎలవెనిల్ వలరివన్ జోడీ, అంజుమ్ మౌడ్గిల్, దీపక్ కుమార్ జోడీలు నిరాశపరిచాయి. ఇండియన్ టెబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ శరత్ కమల్ మూడో రౌండ్లో ఓడిపోయాడు. ఒలింపిక్ చాంపియన్ మా లాంగ్ చేతిలో అతడు 1-4 తేడాతో పరాజయం పాలయ్యాడు.
సాత్విక్-చిరాగ్ జోడీ ఔట్..
బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ గ్రూప్-ఏ మ్యాచులో విజయం సాధించినప్పటికీ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. మరో మ్యాచ్లో చైనీస్ తైపీ జోడీ టాప్ సీడ్ ఇండోనేషియా జోడీపై గెలవడంతో సాత్విక్, చిరాగ్కు నిరాశ తప్పలేదు. మంగళవారం లేన్ బెన్, వెండీ సేన్తో జరిగిన పోరులో 21-17, 21-19తో సాత్విక్-చిరాగ్ జోడీ విజయం సాధించింది. కానీ రెండో మ్యాచ్లో ఇండోనేషియా జోడీ చేతిలో ఓడటంతో వెనుదిరిగాల్సి వచ్చింది.