టోక్యో: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షుమాలిక్ నిరాశపరిచారు. గురువారం జరిగిన మహిళల 53 కేజీల క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ ఓటమి పాలవ్వగా.. రేపిచేజ్ ద్వారా వచ్చిన సువర్ణవకాశాన్ని అన్షు మాలిక్ చేజార్చుకుంది. దాంతో ఈ ఒలింపిక్స్లో అన్షు మాలిక్ పోరాటం ముగిసింది. మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్ రౌండ్లో ఓటమి పాలైంది. రష్యా ఒలింపిక్స్ కమిటీ క్రీడాకారిణి కొబ్లొవా చేతిలో 1-5 తేడాతో చిత్తయింది.
ఇద్దరు అమ్మాయిలు మొదటి నుంచీ నువ్వా నేనా అన్నట్టే ఆడారు. తొలి పిరియడ్లో కొబ్లొవా 1 పాయింటు సాధించి ముందుకెళ్లింది. ఇక రెండో పిరియడ్లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అన్షు కాళ్లను లక్ష్యంగా ఎంచుకున్న కొబ్లొవ్ వరుసగా ఫిట్లే(ప్రత్యర్థి కాళ్లను మెలిపెట్టడం)కు గురిచేసి 4 పాయింట్లు సాధించింది. దాంతో మాలిక్కు పుంజుకునే అవకాశం దక్కలేదు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది. అయినప్పటికీ టోక్యోలో ఆమెకు మరో అవకాశం ఉంది. ఒకవేళ వనేసా ఫైనల్ చేరితే వినేశ్కు రెపిచేజ్ రౌండ్లో పోటీపడే వీలుంటుంది.
ఇక గురువారం పోటీల్లో ఈ ఇద్దరు నిరాశపరిచిన భారత పురుషుల హాకీ టీమ్ అద్భుత విజయం సాధించింది. జర్మనీతో జరిగిన బ్రాంజ్ ఫైట్లో 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో మెడల్తో మెరిసింది. చివరి సారిగా 1980 మాస్కో ఒలింపిక్స్లో భారత్ స్వర్ణం గెలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు కాంస్యం సాధించింది. భారత్ తరఫున సిమ్రన్ జీత్ సింగ్ (17, 34 నిమిషం), హార్దిక్ సింగ్ (27నిమిషం), హర్మన్ప్రీత్ సింగ్ (29నిమిషం), రూపిందర్ పాల్ సింగ్ (31నిమిషం) గోల్స్ చేశారు. ఇక మధ్యాహ్నం భారత స్టార్ రెజ్లర్ రవికుమార్ దహియా ఫైనల్ బౌట్ ఉంది.