
దోహా: ఆసియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల జోరు కొనసాగుతోంది. భారత మహిళా సీనియర్ స్టార్ షూటర్ తేజస్విని సావంత్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. షూటింగ్లో ఇది భారత్కు 12వ ఒలింపిక్ కోటా బెర్త్. శనివారం జరిగిన ఆసియా చాంపియన్షి మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ఫైనల్లో తేజస్విని 435.8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. పతకం చేజారినా.. తుది పోరుకు చేరడంతో టోక్యో బెర్త్ దక్కింది. గత మూడు సార్లు (2008, 2012,20 16) అవకాశాలను చేజార్చుకున్న తేజస్విని ఈసారి అద్భుత షాట్లతో ఆకట్టుకుంది.
ఫైనల్కు చేరిన ఎనిమిది మందిలో ఆరుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో అందుబాటులో ఉన్న రెండు బెర్త్లలో ఒకటి భారత్కు, మరోటి జపాన్ (షివోరి)కు లభించాయి. మహారాష్ట్రకు చెందిన 39 ఏళ్ల తేజస్విని క్వాలిఫికేషన్ రౌండ్లో 1171 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. 2010లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్గా గుర్తింపు పొందిన తేజస్వినికి ఇప్పటివరకు ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు.
ట్రయల్స్ లేకపోతే మాత్రం తేజస్విని ఒలింపిక్ కల సాకారం అవుతుంది. ట్రయల్స్ నిర్వహిస్తే అందులో నెగ్గాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇప్పటివరకు భారత్ నుంచి 12 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందారు. తేజస్విని, కాజల్, గాయత్రిలతో కూడిన భారత బృందానికి 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో కాంస్యం దక్కింది.
పురుషుల 25 మీటర్ల ఫైర్ పిస్టల్ ఈవెంటులో గురుప్రీత్ సింగ్ 586 పాయింట్లతో రజతం దక్కించుకోగా.. టీమ్ విభాగంలో యోగేశ్ సింగ్, ఆదర్శ్ సింగ్ 1730 పాయింట్లతో కాంస్యం అందుకుంది. మొత్తంగా శనివారం జరిగిన వేర్వేరు పోటీల్లో భారత షూటర్లు తొమ్మిది పతకాలను ఖాతాలో వేసుకున్నారు.