పటియాల: ఆసియాలోనే అతిపెద్ద క్రీడా శిక్షణ కేంద్రాల్లో ఒకటైన పటియాల నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఐ ఎస్) డొల్లతనం బయటపడింది. ఇటీవలే అక్కడి సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించకపోవడంతో పాటు ఇద్దరు బాక్సర్లు క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ వార్తలు రాగా... తాజాగా అథ్లెట్లకు సరైన భోజనం అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
భారత స్టార్ స్ప్రింటర్ హిమ దాస్తో పాటు ఇతర అథ్లెట్లు తమకు ఎన్ఐఎస్లో మంచి ఆహారం పెట్టడం లేదని అక్కడి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్ఐఎస్ వంటగది ఆవరణ అపరిశుభ్రంగా ఉందని.. కొవిడ్-19 నిబంధనలు కూడా పాటించడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అందించిన ఆహారంలో వెంట్రుకలు, గోళ్లు ఉండటంతో హిమదాస్ ఈ అంశాన్ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వాటి ఫోటోలను కెమెరాతో చిత్రీకరించిన హిమ ఆ దృశ్యాలను ఎన్ఐఎస్ పాలక అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిందంట.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కిరణ్ రిజుజు వెంటనే భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులను మందలించి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. 'ఎన్ఐఎస్ భోజనశాలలో అపరిశుభ్రత, ఆహారం నాసిరకంగా ఉండటంపై అథ్లెట్లు ఆగస్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకున్నాం.
అథ్లెట్లు, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించాం. ఆటగాళ్ల అవసరాలకు అనుగుణంగా వారికి అందించాల్సిన ఆహారం నాణ్యత, పరిమాణంపై సూచనలు జారీ చేశాం. ఇప్పుడు వారికి అందుతున్న ఆహారం పట్ల అథ్లెట్లు కూడా సంతోషంగా ఉన్నారు' అని 'సాయ్' పేర్కొంది.