హైదరాబాద్: ఆసియా గేమ్స్ కోసం ఎంపిక చేసిన అథ్లెట్స్ జాబితాపై విముఖత వ్యక్తం అవుతుంది. ఈ మేరకు జాబితాని పున:పరిశీలించాల్సిందంటూ ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ (ఐఓఏ)కి తాజాగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఇండోనేషియాలోని జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే ఐఓఏ 524 మందితో కూడిన భారత జట్టుని ప్రకటించింది.
కానీ.. ఈ జట్టు ఎంపికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో తాజాగా మంత్రిత్వ శాఖ స్పందించింది. ప్రతిభ ఉన్న అథ్లెట్స్ ఎంపిక కోసం అవసరమైతే మార్చి 10, 2015లో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిబంధనలను సైతం సడలించే వెసలుబాటుని కల్పించింది. జూలై 3న ఇండియన్ ఒలింపిక్ అసోషియేషన్ (ఐఓఏ) 524 మందితో కూడిన భారత జట్టుని ప్రకటించగా.. అందులో 277 మంది పురుషులు, 247 మంది మహిళా అథ్లెట్స్ ఉన్నారు.
మొత్తం 36 విభాగాల్లో భారత్ అథ్లెట్స్ పోటీ పడనుండగా.. అధికారులతో కలిసి మొత్తం 2,370 మందితో కూడిన జాబితాను ఐఓఏ మంత్రిత్వ శాఖకి ఈ నెల ఆరంభంలో పంపింది. 2014లో జరిగిన ఆసియా గేమ్స్ కోసం 28 విభాగాల్లో మొత్తం 541 మంది ఆటగాళ్లు పోటీపడ్డారు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు మరో ఎనిమిది విభాగాల్లో అదనంగా భారత్ పోటీపడనుంది. అయినప్పటికీ.. ఈ ఏడాది 524 మంది అథ్లెట్స్నే ఎంపిక చేయడానికి కారణం.. మూడేళ్ల క్రితం మంత్రిత్వ శాఖ విధించిన నిబంధనలే అని విమర్శలు వచ్చాయి.
దీంతో.. మరోసారి ఈ జాబితాని పరిశీలించి.. ప్రతిభతో టోర్నీలో టైటిల్ లేదా టాప్-4లో నిలవగలిగే సామర్థ్యం ఉన్న అథ్లెట్స్ కోసం నిబంధనలు సైతం సడలించే వెసులబాటుని అసోషియేషన్కి కల్పించింది. 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ని దృష్టిలో పెట్టుకుని ఆసియా గేమ్స్కి ఆటగాళ్లను ఎంపిక చేశామని ఐఓఏ జనరల్ సెక్రటరీ రాజీవ్ మొహతా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. భారత్ కొత్తగా కరాటే, సెపక్ తక్రా, ట్రయల్థాన్, క్యురాష్, రోలర్ స్కేటింగ్, పెన్కాక్, సైలెట్, శాంబో క్రీడల్లో కొత్తగా పోటీపడనుంది. ఈ కారణంగా.. ఆటగాళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.