న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) కూడా తన శిక్షణా కేంద్రాలను నిలిపివేసింది. మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించిన ప్రసంగించిన సందర్భంగా లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ ట్రైనింగ్ సెంటర్లను సైతం నిలిపివేస్తున్నట్లు శాయ్ అధికారి ఒకరు పీటీఐకు తెలిపారు.
తమ శిక్షణ కేంద్రాలను తొలుత ఏప్రిల్ 14 వరకే నిలిపివేయాలనుకున్నామని, కానీ ఈరోజు ప్రధాని లాక్డౌన్ను పొడిగించడంతో మళ్లీ అప్పటివరకు నిలిపివేస్తున్నట్లు ఆ అధికారి అన్నారు. ఇక బెంగుళూరు, పాటియాలా శిక్షణా కేంద్రాల్లో ఉంటున్న అథ్లెట్లు అక్కడే ఉండాలని సూచించారు. దీంతో పాటియాలా శిక్షణ కేంద్రంలో ఉన్న భారత స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా అక్కడే హాస్టల్లో ఉండిపోనున్నాడు. నీరజ్ గతనెల టర్కీకి వెళ్లివచ్చాక పాటియాలాలోనే ఉంటున్నాడు. మరోవైపు భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 10,363 మంది వైరస్ బారిన పడగా, అందులో 339 మంది మరణించారు.