ఢిల్లీ: లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉండిపోయిన పాఠశాల పిల్లలను ఉత్తేజపరిచే ఉద్దేశ్యంతో మన దేశంలోని అగ్రశ్రేణి క్రీడాకారులతో వరుస ఇంటరాక్టివ్ సెషన్లు ప్రారంభిస్తున్నట్లు భారత ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దేశంలోని ప్రజలందరూ ఫిట్గా ఉండాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'ఫిట్ ఇండియా'లో భాగంగా 'ఫిట్ ఇండియా టాక్స్' అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరెన్ రిజిజుతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ప్రారంభించనున్నారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) సహకారంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహిస్తున్నారు. 'మా పాఠశాల పిల్లలతో నేరుగా ఒక వేదిక ద్వారా మాట్లాడాలని నేను కిరెన్ రిజిజును అభ్యర్థించాను. ఆయన పూర్తిగా బాధ్యత వహించడమే కాకుండా.. మా మొదటి సెషన్ కోసం పీవీ సింధు, సునీల్ ఛెత్రిలాంటి క్రీడాకారులను తీసుకువస్తున్నారు. మనమందరం శుక్రవారం కలుద్దాం. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే సెషన్లో మీ ప్రశ్నలకు మేం సమాధానం ఇస్తాం' అని నిశాంక్ ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 3 నుంచి 14 వరకు మొత్తం ఆరు ఇంటరాక్టివ్ సెషన్లు జరుగుతాయని మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ సెషన్లలో దేశంలోని క్రీడా ప్రముఖులు పాల్గొని తమ బాల్య అనుభవాలు, వారు ఎలా ప్రేరణ పొందారు, వారి వైఫల్యాలు, పోరాటాలు, సాధారణ పాఠశాల స్థాయి విద్యార్థుల నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులుగా ఎలా ఎదగారు లాంటి ఆసక్తికరమై విషయాలను పాఠశాల విద్యార్థులతో పంచుకుంటారని ఆయన చెప్పారు. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సెషన్లలో తప్పక పాల్గొనాలని నిశాంక్ కోరారు.
రాబోయే సెషన్లలో బ్యాడ్మింటన్ స్టార్ అశ్విని పొన్నప్ప, భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్, టేబుల్ టెన్నిస్ స్టార్ మణికా బాత్రా, షూటర్ అపుర్వి చందేలా, స్ఫూర్తిదాయకమైన పారాలింపియన్ దీపా మాలిక్ పాల్గొంటారని నిశాంక్ పేర్కొన్నారు. కాగా ఈ సెషన్లు.. నిశాంక్ సోషల్ మీడియా పేజీలు, ఎంహెచ్ఆర్డీ సోషల్ మీడియా పేజీలు, ఫిట్ ఇండియా ఫేస్బుక్ పేజీ, యూట్యూబ్ చానెల్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఫేస్బుక్ పేజీ, మైగవర్నమెంట్ యూట్యూబ్ చానెల్లో ప్రసారం కానున్నాయి.
'పంత్ కొన్ని స్టంపింగ్లు వదిలేసినా.. టెస్టుల్లో అతడినే ఎంపికచేయాలి'