పీవీ సింధు జోరు
భారత బ్యాడ్మింటన్ స్టార్, రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో సింధు 21-15, 21-13 తేడాతో 12వ ర్యాంక్ బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)ను చిత్తు చేసింది. 40 నిమిషాల్లోనే ప్రత్యర్థిని కంగుతినిపించింది. బ్లిచ్ఫెల్ట్పై ఉన్న ఆధిక్యాన్ని సింధు 5-1కి పెంచుకుంది. క్వార్టర్స్, సెమీస్లో సింధుకు కఠిన ప్రత్యర్థులు ఎదరయ్యే అవకాశం ఉంది. క్వార్టర్స్లో అకానె యమగూచి, సెమీస్లో తైజు యింగ్తో తలపడాల్సి రావొచ్చు.
చకదే ఇండియా..
భారత హాకీ టీమ్ సైతం క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్లో మన్ప్రీత్ సింగ్ సేనా 3-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. దాంతో తొలి రెండు క్వార్టర్లలో గోల్సే నమోదు అవ్వలేదు. రెండు జట్లు దుర్భేద్యమైన డిఫెన్స్తో ముందుకు సాగాయి. 43వ నిమిషంలో వరుణ్ కుమార్ గోల్ కొట్టి భారత్ను 1-0తో ఆధిక్యంలో నిలిపాడు. 48వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను షూత్ కేసెల్లా గోల్గా మలవడంతో స్కోరు 1-1తో సమమైంది. ఆట ముగిసే క్రమంలో 58వ నిమిషంలో వివేక్ సాగర్ ప్రసాద్, 59వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ గోల్స్ కొట్టి 3-1తో భారత్కు విజయాన్ని అందించారు.
పతకానికి పంచ్ దూరంలో..
భారత బాక్సర్ సతీశ్ కుమార్ 91+ కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాడు. జమైకాకు చెందిన రికార్డో బ్రౌన్పై 4-1 తేడాతో ఘన విజయం సాధించాడు. ప్రత్యర్థి పాదాల కదలిక చురుగ్గా లేకపోవడాన్ని గమనించిన సతీశ్ అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. క్వార్టర్ ఫైనల్లో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బాఖోదిర్ జలోలొవ్తో అతడు తలపడనున్నాడు. జలోలొవ్ ప్రపంచ, ఆసియా చాంపియన్ కావడం గమనార్హం. అతన్ని ఓడించి సెమీస్కు చేరితే సతీశ్కు కనీసం కాంస్యం ఖాయమవుతుంది.
అదరగొట్టిన అతాను దాస్..
పురుషుల ఆర్చరీ వ్యక్తిగత పోటీల్లో అతానుదాస్ ప్రీక్వార్టర్స్కు చేరుకున్నాడు. తొలి ఎలిమినేషన్ పోరులో డెంగ్ యు చెంగ్ను 6-4 తేడాతో ఓడించాడు. ఆ తర్వాత లండన్ ఒలింపిక్ విజేత, కఠిన ప్రత్యర్థి హో జిన్హెక్పై అద్వితీయ విజయం అందుకున్నాడు. షూటాఫ్కు చేరిన పోరులో కొరియా ఆటగాడిని 6-5 తేడాతో ఓడించాడు. ఐదు సెట్లు ముగిసే సరికి స్కోర్లు 5-5తో సమం అయ్యాయి. షూటాఫ్లో జిన్హెక్ 9 స్కోర్ చేయగా అతాను 10కి గురిపెట్టి ముందంజ వేసాడు.
మేరీ కోమ్ నిష్క్రమణ..
గురువారం వచ్చిన వరుస విజయాలతో సంతోషంలో మునిగిన అభిమానులకు చివరి క్షణంలో గట్టి షాక్ తగిలింది. భారత అగ్రశ్రేణి బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో ఆమె పోరాడి ఓడింది. కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది.
అధికారికంగా ప్రకటించకపోయినా ఈ ఓటమితో మేరీ కోమ్ బాక్సింగ్ ప్రస్థానం ముగిసినట్లే. గురువారం భారత చివరి ఈవెంట్ అయిన స్విమ్మింగ్ పోటీల్లోనూ భారత్కు నిరాశే ఎదురైంది. పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్ సెమీస్ బెర్త్ సాధించలేకపోయాడు. 53.45 సెకండ్ల టైమింగ్తో 46వ స్థానంలో నిలిచాడు. టాప్-16 ప్లేయర్లకే సెమీస్లో పాల్గొనే చాన్స్ ఉంటుంది.