
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్(96) సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు(సోమవారం) ఉదయం ఈ హాకీ దిగ్గజం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్లో భారత్కు మూడుసార్లు స్వర్ణ పతకాలు తీసుకురావడంలో బల్బీర్సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక ఈ హాకీ దిగ్గజం మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
'బల్బీర్ సింగ్ మరణవార్త బాధకలిగించింది. మూడు ఒలింపిక్ గోల్డ్ మెడళ్లు, పద్మశ్రీ అవార్డు అందుకున్న గొప్ప అథ్లెట్ అయన. భవిష్యత్ తరాలకు ఆయన ఎంతో ఆదర్శం. ఆయన కుటుంబానికి, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి'అంటూ రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.
'పద్మశ్రీ బల్బీర్ సింగ్ ఆయన చేసిన ప్రదర్శనల్లో మనకు గుర్తుండిపోతారు. ఆయన దేశానికి ఎంతో గౌరవాన్ని, ఎన్నో పురస్కారాలను తీసుకువచ్చారు. ఆయన అత్యద్భుతమైన హాకీ ప్లేయర్ మాత్రమే కాదు.. గొప్ప మెంటార్ కూడా. ఆయన మరణ వార్త ఎంతో బాధించింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి'' అంటూ మోదీ ట్వీట్ చేశారు.
ఇక భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ సైతం హాకీ దిగ్గజం మరణంపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేశారు. బల్బీర్ సింగ్ సీనియర్ మరణ వార్త తనను బాధించిందని ఆయన కుంటుంబానికి సంతాపం తెలియజేస్తూ కోహ్లీ ట్వీట్ చేయగా.. దిగ్గజాలు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో జీవిస్తారని రైనా ట్వీట్ చేశాడు.