టోక్యో: ప్రతిష్టాత్మక పారాలింపిక్స్లో భారత టేబుల్ టెన్నిస్(టీటీ) ప్లేయర్ భవీనాబెన్ పటేల్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా ప్యాడ్లర్ మియావో జాంగ్పై 3-2తో తిరుగులేని విజయం సాధించింది. వరల్డ్ నంబర్ త్రీ ప్లేయర్ అయిన జాంగ్ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 స్కోర్తో మట్టికరిపించింది. దీంతో ఫైనల్కు చేరిన తొలి భారత టీటీ ప్లేయర్గా చరిత్రకెక్కింది. భవానీ సూపర్ ఫెర్ఫామెన్స్తో పారాలింపిక్స్లో భారత్కు ఓ మెడల్ ఖాయమైంది. కాగా, ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ వన్ సీడ్, చైనా ప్లేయర్ యింగ్ ఝోతో తలపడనుంది. ఆ మ్యాచ్లో భవీనా ఒకవేళ ఓడినా భారత్కు సిల్వర్ మెడల్ దక్కనుంది.
పోలియో జయించి పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచిన భవీనాబెన్ ప్రయాణం పలువురికి ఆదర్శం. సెమీస్లో భవీనాబెన్ ఆట అద్భుతమనే చెప్పాలి! గతంలో ఆమెపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జాంగ్ను తనదైన ఆటతో ఓడించింది. సుమారు 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలినా.. వరుసగా రెండు, మూడు గేమ్లు గెలుచుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకం.
కీలకమైన నాలుగో గేమ్లో ప్రత్యర్థి జంగ్ తన సూపర్ క్లాస్ ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా 2-2తో సమమైన మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో గేమ్కు దారితీసింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా ఆఖరి గేమ్లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జాంగ్ సైతం వేగంగానే స్పందించి స్కోరును 5-9కి అట్నుంచి 8-9కి తగ్గించింది. ఈ క్రమంలో టైమ్ఔట్ తీసుకున్న భవీనా ఆట మొదలవ్వగానే వరుసగా రెండు పాయింట్లు సాధించి సగర్వంగా ఫైనల్కు చేరుకుంది.
ఫైనల్కు చేరడంపై సంతోషం వ్యక్తం చేసిన భవీనాబెన్ పటేల్.. స్వర్ణ పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. 'నేనిక్కడికి వచ్చినప్పుడు మరేం ఆలోచించకుండా 100 శాతం శ్రమించాలని అనుకున్నా. ఎందుకంటే శక్తిమేరకు కష్టపడితే పతకం కచ్చితంగా వస్తుంది. నా దేశ ప్రజల ఆశీర్వాదాలు, ఇదే ఆత్మవిశ్వాసంతో కొనసాగితే ఆదివారం కచ్చితంగా స్వర్ణం గెలవగలను. నేను పసిడి పోరుకు సిద్ధంగా ఉన్నాను' అని భవీనా విజయానంతరం మీడియాలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.
అంతకుముందు శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో సెర్బియాకు చెందిన బోరిస్లావా పెరిక్ రాంకోవిచ్ని భావీనాబెన్ 3-0తో ఓడించింది. ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన రాంకోవిక్ను భారత క్రీడాకారిణి 18 నిమిషాల్లోనే 11-5, 11-6, 11-7 వరుస సెట్లలో ఓడించింది. ఫైనల్ చేరిన భవీనాబెన్పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. దిగ్గజ సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు భావీనాబెన్ను ప్రశంసిస్తున్నారు. ఫైనల్లో స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.