న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇక క్రీడలైతే మొత్తం బందయ్యాయి. అంతర్జాతీయ వేదికలపై తప్పా మరెక్కడా దాయాదులు తలపడటం లేదు. పాకిస్థాన్లో నిర్వహించే టోర్నీల్లో కూడా భారత్ పాల్గొనడం లేదు. ఆ ఆటగాళ్లను భారత్కు రాణించడం లేదు.
అయితే తాజాగా భారత్ వేదికగా జరగనున్న ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పాకిస్తాన్ రెజ్లర్లు పాల్గొననున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ రెజ్లర్లు అయిన ముహమ్మద్ బిలాల్, అబ్దుల్ రెహ్మాన్, తయబ్ రాజా, జమాన్ అన్వర్లకు భారత ప్రభుత్వం శనివారం వీసాలను జారీ చేసినట్లు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ తెలిపారు. ఇక ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19(కరోనా) వైరస్ కారణంగా చైనా రెజ్లర్లకు ఇంకా వీసాలను జారీ చేయలేదు. వీరి విషయంపై నేడు(సోమవారం) స్పష్టత రానుంది.
గతేడాది ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాక్లో భారత్, భారత్లో పాక్ పర్యటించలేదు. గత ఏడాది డేవిస్ కప్లో భాగంగా పాకిస్తాన్లో భారత్ పర్యటించాల్సి ఉన్నా... భద్రతా కారణాలతో ఆ పోరు తటస్థ వేదికపై జరిగింది. ఇక క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్లైతే మొత్తానికే జరగడం లేదు. పాక్ వేదికగా జరగనున్న ఆసియాకప్ను తాము బహిష్కరిస్తామని భారత్ తెలపగా.. అలా చేస్తే భారత్లో జరిగే టోర్నీలను తాము బహిష్కరిస్తామని పాక్ హెచ్చరిస్తోంది.