
చెన్నై: కరోనా నేపథ్యంలో తొలిసారి ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ ఫైనల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆదివారం రష్యాతో జరిగిన ఈ టైటిల్ పోరులో గట్టి పోటీనిచ్చిన భారత్.. చివరకు నిహల్ సరిన్, దివ్యా దేశ్ ముఖ్లు ఇంటర్నెట్ కనెక్షన్ కోల్పోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వివాదాస్పద రీతిలో ఉన్న ఈ ఫలితంపై భారత అధికారులు అప్పీల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఫైడ్.. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించింది. ఫైడ్ ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్ ఇరు జట్లకు గోల్డ్ మెడల్స్ ఇవ్వాలని నిర్ణయించారని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది. దీంతో ఒలింపియాడ్ చరిత్రలోనే భారత్ తొలి సారి బంగారు పతకం గెలుచుకున్నట్లు అయింది.
విదిత్ గుజరాతి నేతృత్వంలోని మాజీ వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, కొనేరు హంపి, డి హరికా, ప్రాగ్నానంద, పెంటాల హరికృష్ణ, దివ్య దేశ్ ముఖ్, నిహల్ సరిన్లతో కూడిన భారత జట్టు అనూహ్య రితీలో బంగారు పతకాన్ని స్వాదీనం చేసుకుంది. భారత ఆటగాళ్ల ఇంటర్నెట్ కనెక్షన్లో సమస్య తలెత్తడంతో నిహాల్ సరిన్, దివ్య దేశ్ముఖ్ సర్వర్తో సంబంధాన్ని కోల్పోయారు. దీంతో నిర్వహాకులు వారు ఓడినట్లుగా ప్రకటించారు.. కనెక్షన్ కోల్పోయేముందు రెండో రౌండ్లో దేశ్ముఖ్ గెలిచే స్థితిలో ఉంది.
అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో భారత్ 3-3 తో డ్రా ముగించింది. రెండవ రౌండ్ రౌండ్లో నిహల్ సరిన్, దివ్య దేశ్ముఖ్ ఇంటర్నెట్ అసౌకర్యంతో పరాజయం పాలయ్యారు. ఈ ఓటమికి ముందే మ్యాచ్ ఆర్మగెడాన్ ముగింపుకు సెట్ చేయబడింది. 'అర్మగెడాన్' గేమ్ నిబంధనల ప్రకారం టాస్ గెలిచిన వారికి తెల్లపావులు లేదంటే నల్లపావులను ఎంచుకునే అవకాశం ఉంటుంది. తెల్లపావులతో ఆడే వారికి ఐదు నిమిషాలు, నల్లపావులతో ఆడే వారికి నాలుగు నిమిషాలు ఇస్తారు. తెల్లపావులతో ఆడే వారికి అదనంగా ఒక నిమిషం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు కచ్చితంగా గెలవాలి. మరోవైపు నల్లపావులతో ఆడేవారికి ఒక నిమిషం తక్కువ ఉంటుంది కాబట్టి వారు 'డ్రా' చేసుకున్నా చాలు వారినే విజేతగా ప్రకటిస్తారు.
క్వార్టర్ ఫైనల్లో భారత్తో పరాజయంపాలైన అర్మెనియా కూడా ఇలాంటి ఇంటర్నెట్ సమస్యలనే ఎదుర్కొంది. వారు కూడా అప్పీల్ చేశారు. ఇక పోలాండ్ జట్టుతో శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ టైబ్రేక్లో 1-0తో గెలిచిన విషయం తెలిసిందే. చెస్ ఒలింపియాడ్లో భారత అత్యుత్తమ ప్రదర్శన కాంస్య పతకం (2014లో) కాగా.. ఈసారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.