అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్ల పతకాల జోరు కొనసాగుతోంది. అహ్మదాబాద్ వేదికగా సోమవారం జరిగిన పోటీల్లో తెలంగాణ నాలుగు పతకాలు కైవసం చేసుకుంది. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో, మహిళల 3-3 బాస్కెట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్లు పసిడి పతకాలు సాధించాయి. బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో తెలంగాణ 3-0తో కేరళను చిత్తు చేసింది. మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి-సిక్కి రెడ్డి జంట 21-15, 14-21, 21-14తో అర్జున్-ట్రీసా జాలీపై, పురుషుల సింగిల్స్లో సాయిప్రణీత్ 18-21, 21-16, 22-20తో ప్రణయ్పై, మహిళల సింగిల్స్లో సామియా 21-5, 21-12తో గౌరికృష్ణపై గెలుపొందారు.
Winning Celebrations🤩🏸 #Telangana Badminton team celebrate their win after clinching gold🥇 in Mixed Team event🤩 by cutting a cake 🎂 in the name of their victory #36thNationalGames #NationalGames2022 pic.twitter.com/QlhajlHSs6
— SAI Media (@Media_SAI) October 3, 2022
మహిళల 3-3 బాస్కెట్బాల్ ఫైనల్లో తెలంగాణ 17-13తో కేరళపై నెగ్గి బంగారు పతకాన్ని అందుకుంది. ఆరు పాయింట్లు సాధించిన పుష్ప తెలంగాణ గెలుపులో కీలకపాత్ర పోషించింది. మహిళల స్విమ్మింగ్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో హైదరాబాద్ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ 9.23 సెకన్లలో రేసును పూర్తి చేసి సిల్వర్ మెడల్తో మెరిసింది. పురుషుల రోయింగ్ ఎమ్-8 కాక్స్డ్ కేటగిరీలో బాలకృష్ణ రెడ్డి, నితిన్ కృష్ణ, సాయిరాజ్, చరణ్సింగ్, మహేశ్వర్ రెడ్డి, గజేంద్ర యాదవ్, నవదీప్, హర్దీప్ సింగ్తో కూడిన తెలంగాణ టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించింది.
#Telangana team Mixed Team event Gold medalists🥇
— SAI Media (@Media_SAI) October 3, 2022
Congratulations!#36thNationalGames #NationalGames2022 pic.twitter.com/o3DsrTbvjf
ఆంధ్ర అథ్లెట్లు సైతం..
మహిళల జిమ్నాస్టిక్స్లో ట్రంపోలిన్ కేటగిరీలో విజయవాడ అమ్మాయి షేక్ యాసిన్ కళ్లు చెదిరే విన్యాసాలతో రజతం సొంతం చేసుకుంది. హెప్టాథ్లాన్లో విజయవాడకు చెందిన సౌమ్య కాంస్య పతకం కొల్లగొట్టింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 87 కిలోల విభాగంలో విజయనగరం అమ్మాయి సత్యజ్యోతి కాంస్యంతో మెరిసింది. సత్య స్నాచ్లో 90, జెర్క్లో 111, మొత్తం 201 కిలోల బరువెత్తి తృతీయ స్థానం దక్కించుకుంది. ఇక, ఆర్చరీ మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో భీమవరం అమ్మాయిలు సూర్యహంసిని, రూపచంద్ర, హాసిని, షణ్ముఖి (విజయవాడ) బృందం228-225తో న్యూఢిల్లీని ఓడించి ఫైనల్ చేరింది.