టోక్యో: మొండిగా ఒలింపిక్స్ నిర్వహిస్తే భయంకరమైన సరికొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని జపాన్ వైద్యుల సంఘం హెచ్చరించింది. మెగా క్రీడల కోసం దాదాపుగా 200 దేశాల నుంచి లక్షకు పైగా అథ్లెట్లు, కోచ్లు, మ్యాచ్ అధికారులు, వలంటీర్లు, జర్నలిస్టులు జపాన్కు వస్తారని, వారి వల్ల కొత్త స్ట్రెయిన్ పుట్టకొస్తుందని జపాన్ వైద్యుల సంఘం అధ్యక్షుడు నావోటో యుమేమా తెలిపారు. ఒలింపిక్ క్రీడల నిర్వహణ ప్రమాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
'ఇప్పటికే చాలా దేశాల్లో వైరస్ విభిన్న రకాల స్ట్రెయిన్స్తో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆయా దేశాల వాళ్లంతా ఒలింపిక్స్ కోసం ఒకే చోట చేరతారు. అప్పుడు ఓ కొత్త వైరస్ స్ట్రెయిన్ ఆవిర్భవించే అవకాశాలను కొట్టిపారేయలేం. అలాంటి పరిస్థితే తలెత్తితే టోక్యో ఒలింపిక్స్ స్ట్రెయిన్ అర్థం వచ్చేలా పిలవాల్సి ఉంటుంది. అది విషాదంగా మారుతుంది. జపాన్లో ఆరోగ్య సంక్షోభం ఏర్పడం ఖాయం. కనీసం వందేళ్ల వరకు విమర్శలకు దారితీయొచ్చు' అని నావోటో హెచ్చరించారు.
ప్రస్తుతం జపాన్లో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోంది. ఆ దేశంలో కేవలం 5 శాతం మాత్రమే వ్యాక్సినేషన్ పూర్తైంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో నగరాల్లో అత్యవసర
వైద్య పరిస్థితిని పొడగించారు. ఈ నేపథ్యంలో మెగా క్రీడలను రద్దు చేయాలని 70 శాతం మంది ప్రజలు కోరుతున్నారు. ఒలింపిక్స్ ఆరంభ సమయానికి 90 శాతం మంది క్రీడాకారులకు టీకా కార్యక్రమం పూర్తవుతుందని, కఠిన ఆంక్షలు, బుడగల మధ్య క్రీడలు నిర్వహిస్తామని ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం ప్రకటించాయి. కానీ ఆదేశ వైద్యుల సంఘం హెచ్చరికల నేపథ్యంలో మెగా ఈవెంట్ రద్దు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
ప్రస్తుతం జపాన్.. పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది. మొండిగా ఒలింపిక్స్ నిర్వహిస్తే కొత్త స్ట్రెయిన్తో ఆరోగ్య సంక్షోభం ఏర్పడనుంది. నిర్వహించకపోతే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లనుంది.