ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వెయిట్లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ పేరును ఈ ఏడాది కేంద్ర క్రీడా పురస్కారం 'అర్జున' అవార్డు కోసం భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) నామినేట్ చేసింది. 23 ఏళ్ల తెలుగు లిఫ్టర్ కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్న విషయం తెలిసిందే. రాహుల్తో పాటు మీరాబాయి చాను (మణిపూర్), పూనమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) పేర్లను ఐడబ్ల్యూఎల్ఎఫ్ కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది.
బుమ్రా బౌలింగ్ ఇప్పటికీ విస్మయమే.. అతడు తరానికి 'ఒకే ఒక్కడు'!!
గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్ రాహుల్ 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో పురుషుల 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. 2015, 2017లలో కామన్వెల్త్ చాంపియన్షిప్లో పసిడి పతకాలు గెలిచాడు. 2015 ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో బంగారు పతకం, 2014 యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో రజతం, 2013 ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం, 2013 ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
స్టార్ లిఫ్టర్ మీరాబాయ్ చానుని కూడా అర్జునకు నామినేట్ చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ప్రపంచ మాజీ చాంపియన్ అయిన చాను.. ఇప్పటికే క్రీడల్లో అత్యున్నత పురస్కారం 'రాజీవ్ ఖేల్రత్న' అందుకుంది. అలాంటిది ఆమె పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించడంపై చర్చ మొదలైంది. వాస్తవానికి ఖేల్రత్న కోసం ఎవరినైనా నామినేట్ చేయాలంటే.. ముందుగానే వారికి అర్జున వచ్చి ఉండాలి. కానీ 2017లో మీరాబాయి ప్రపంచ చాంపియన్షిప్లో 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా నిలువడంతో.. ఆమె ఘనతకు గుర్తింపుగా కేంద్ర క్రీడాశాఖ నేరుగా ఖేల్రత్నను అందజేసింది.
ఇప్పటికే తాను అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్రత్న అందుకున్నా.. అర్జున అవార్డు ప్రత్యేకత వేరుగా ఉంటుందని మీరాబాయి వ్యాఖ్యానించింది. 'ఖేల్రత్న అత్యున్నత పురస్కారమని తెలుసు. అయితే గతంలో అర్జున అవార్డును మిస్సయ్యా. అందువల్ల దానినీ కోరుకుంటున్నా. అర్జున పురస్కారం అందుకోవాలని ఏ ఆటగాడికి మాత్రం ఉండదు' అని మీరాబాయి ప్రశ్నించింది. ఇప్పటికే పద్మశ్రీ కూడా దక్కించుకుంది. పూనమ్ యాదవ్ 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2015లో సతీశ్ శివలింగం అర్జున అవార్డు పొందాక మరే వెయిట్లిఫ్టర్కు అర్జున లభించలేదు.