న్యూఢిల్లీ: డ్రాగన్ కంట్రీ చైనాపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం, ముగింపు కార్యక్రమాలకు హాజరుకాబోమని తెగేసి చెప్పింది. గల్వాన్ ఘటనలో భారత సైనికుల చావుకు కారణమైన ఆ దేశ ఆర్మీ అధికారిని ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఈ అంశంలో చైనా తీసుకున్న నిర్ణయం విచారకరం. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరు కాబోము." అని భారత్ స్పష్టం చేసింది.
మరోవైపు.. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారాలను చేయబోమని డీడీ స్పోర్ట్స్ తెలిపింది. ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ ఈ మేరకు వెల్లడించారు. ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు బీజింగ్ వేదికగా వింటర్ ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. చైనా సైనికుడిని టార్చ్ బేరర్గా ఎంపికచేయడాన్ని ప్రపంచ దేశాలు కూడా తప్పుబట్టాయి. అగ్రరాజ్యం అమెరికా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
ఇక 2020 మే 5న గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ పోరాటంలో 40 మందికి పైగా చైనా సైనికులు సైతం మరణించారని ప్రపంచ మీడియా వెల్లడించింది. అయితే, చైనా ఈ విషయాన్ని అంగీకరించలేదు.
నాడు భారత బలగాల చేతిలో గాయపడి ప్రాణాలతో బయటపడిన వ్యక్తినే(కి ఫాబావో) ప్రస్తుతం చైనా తమ ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా నియమించింది. ఇదిలా ఉంటే, చైనా మానవ హక్కుల ఉల్లంగణకు పాల్పడుతుందంటూ అమెరికా సహా పలు ప్రపంచ దేశాలు ఇదివరకే వింటర్ ఒలింపిక్స్ను దౌత్యపరంగా బహిష్కరించిన విషయం తెలిసిందే.