చెన్నై: భారత చెస్ క్రీడాకారిణి, తెలుగు తేజం హారిక ద్రోణవల్లికి యావత్ దేశం హ్యాట్సాఫ్ చెబుతోంది. నిండు గర్భిణి అయిన ఆమె ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత మహిళల టీమ్ తరఫున బరిలోకి దిగుతోంది. విశ్రాంతి తీసుకునే వీలున్నా.. దేశంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న చెస్ ఒలిపింయాడ్లో పాల్గొనాలనే సంకల్పంతో ఆమె ఈ టోర్నీలో పాల్గొంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హారికపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన హారిక ఇప్పటికే ఎన్నో అద్భుత ప్రదర్శనలు కనబర్చింది.
ఆదివారం ముగిసిన మూడో రోజు పోటీల్లో ఆరు భారత టీమ్లు ప్రత్యర్థులను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాయి. తెలుగు గ్రాండ్మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ఇరిగేసి అర్జున్ విజయనాదం చేయగా.. తొలి రెండు రౌండ్లలో ఆడని ద్రోణవల్లి హారిక మూడోరౌండ్లో డ్రాతో టోర్నీని ఆరంభించింది. సీనియర్ జీఎం కోనేరు హంపి ఈ రౌండ్కు విశ్రాంతి తీసుకొంది. పురుషుల విభాగంలో భారత జట్టు 3-1తో గ్రీస్ను ఓడించింది. తెల్ల పావులతో బరిలోకి దిగిన హరికృష్ణ 30 ఎత్తుల్లోనే మాస్ట్రోవాసిల్స్ డిమిట్రైయో్సపై నెగ్గి జట్టుకు శుభారంభాన్ని అందించాడు.
ఆ తర్వాతి గేమ్ను విదిత్ సంతోష్ డ్రా చేసుకోగా, మూడో గేమ్లో అర్జున్ 51 ఎత్తుల్లో మాస్ట్రోవాసిల్స్ అతనాసియో్సపై గెలుపొందాడు. ఆఖరి గేమ్ను శశికిరణ్ డ్రా చేసుకున్నాడు. భారత్-2 జట్టు 4-0తో స్విట్జర్లాండ్పై క్లీన్స్వీప్ చేసింది. గుకేష్, సరీన్ నిహాల్, ప్రజ్ఞానంద, సద్వానీ రౌనక్ ప్రత్యర్థులను చిత్తుచేయగా.. భారత్-3 జట్టు ఐస్లాండ్పై 3-1తో నెగ్గింది. సేతురామన్, అభిజిత్ ప్రత్యర్థులపై నెగ్గగా, గంగూలీ సూర్యశేఖర్, పురానిక్ అభిమన్యు గేమ్లను డ్రా చేసుకున్నారు.
మహిళల విభాగంలో భారత్ 3-1తో ఇంగ్లండ్ను ఓడించింది. హారిక గేమ్ను డ్రా చేసుకోగా వైశాలి, తానియా, అక్షయ విజయాలు సాధించారు. భారత్-2 జట్టు కూడా 3-1తో ఇండోనేసియాపై నెగ్గింది. వంతికా అగర్వాల్, సౌమ్య స్వామినాథన్ గెలవగా.. పద్మిని, మేరీ తమ గేమ్లను డ్రాగా ముగించారు. ఆస్ట్రియాతో తలపడిన భారత్-3 జట్టు 2.5-1.5తో గెలిచింది. తొలి గేమ్ను ఇషా డ్రా చేసుకోగా రెండో గేమ్లో అనారోగ్య సమస్యతో ప్రత్యర్థి నందిదాకు వాకోవర్ ఇచ్చింది. మూడో గేమ్లో మేరుబర్ నికోల చేతిలో సాహితి ఓడింది. దీంతో చెస్ ఒలింపియాడ్లో భారత్కు తొలి ఓటమి ఎదురైంది. ఇక, ఆఖరి గేమ్లో తెలుగమ్మాయి ప్రత్యూష 59 ఎత్తుల్లో ఎలీసాబెత్పై నెగ్గడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.