హైదరాబాద్: దేశీయ క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రారంభం కానున్న అల్టిమేట్ ఖో ఖో లీగ్లో జీఎంఆర్, అదానీ గ్రూప్స్ వరుసగా తెలంగాణ, గుజరాత్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి. ఇప్పటికే ప్రొ కబడ్డీ అద్భుతమైన ఆదరణ చూరగొనగా... ఖో ఖో కూడా అల్టిమేట్ ఖో ఖో (యూకేకే) పేరుతో ఫ్రాంచైజీ టోర్నీగా మనల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (కేకేఎఫ్ఐ) సహకారంతో ఫ్రాంచైజీ బేస్డ్ ఖో ఖో లీగ్ను డాబర్ గ్రూప్ చైర్మన్ అమితక బర్మన్ ఏర్పాటు చేశాడు. సౌతిండియాలో ఖోఖోకు ఉన్న ప్రజాధరణను చూసి లీగ్లో పెట్టుబడి పెట్టామని జీఎంఆర్ వెల్లడించింది. మిగతా క్రీడల్లాగే ఖో ఖోను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ టీమ్ను తీసుకున్నామని జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి తెలిపారు.
క్రీడల్లోనూ భారత్ అగ్రగామిగా అవతరించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నామని, గ్రామీణ క్రీడలైన కబడ్డీ, రెజ్లింగ్, ఖో ఖోలకు మరింత ఆదరణ పెరిగేందుకు దోహదం చేస్తామని తెలిపాడు. ఇక కబడ్డీ, బాక్సింగ్ లీగ్లో ఉన్న తమ అనుభవం ఖోఖో లీగ్లోనూ అద్భుతాలు చేస్తుందని అదానీ ఎంటర్ప్రైజస్ డైరెక్టర్ ప్రణవ్ అదానీ పేర్కొన్నాడు. అల్టిమేట్ ఖో ఖో (యూకేకే) బ్రాడ్కాస్టింగ్ హక్కుల్ని సోనీ సంస్థ దక్కించుకుంది. సోనీ టీవీ చానెళ్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్ 'సోనీ లివ్'లో యూకేకే పోటీలు స్ట్రీమింగ్ కానున్నాయి.