న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బీఎండబ్ల్యూ లగ్జరీ కారును అమ్ముతున్నట్లు భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కారు అమ్మగా వచ్చిన డబ్బుతో ఒలింపిక్స్ శిక్షణకు ఖర్చు చేస్తానని వెల్లడించింది. తర్వాత ఆ పోస్ట్ను తొలగించినా.. అప్పటికే అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే తాజాగా తాను బీఎండబ్ల్యూ కారును అమ్మేయాలనుకుంది.. శిక్షణకు డబ్బుల్లేక కాదని ఈ స్టార్ స్ప్రింటర్ మాట మార్చింది.
లగ్జరీ కారు నిర్వహణ తనవల్ల కాకపోవడం వల్లే దాన్ని అమ్మకానికి పెట్టి నట్టు తెలిపింది. అయితే, ఒడిశా ప్రభుత్వం, కేంద్ర క్రీడా శాఖ, అథ్లెటిక్ సమాఖ్యతో పాటు అనేకమంది స్పాన్సర్లు ఆర్థికంగా ఎంతో తోడ్పాటునిచ్చినా ఇంకా ఆర్థిక ఇబ్బందులు అంటూ ద్యూతీ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో తన పోస్ట్పై వివరణ ఇస్తూ.. 'ఖరీదైన కారు నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. నాకు ఆ కారుతో అంతగా ప్రయోజనం లేదు. దాన్ని అమ్మగా వచ్చిన డబ్బును ఒలింపిక్స్ శిక్షణ కోసం వెచ్చించాలనుకున్నా. అంతేకానీ.. శిక్షణకు డబ్బుల్లేక ఆ కారును అమ్మాలనుకోవడం లేదు. ఒడిశా రాష్ట్రంతో పాటు అనేకమంది నాకు ఆర్థికంగా ఎన్నోసార్లు అండగా నిలిచారు. ఇక ఒడిశా మైనింగ్ కార్పోరేషన్ నుంచి నాకు వచ్చే సాలరీ రూ. 60వేలు మాత్రమే.
దానిపై నేనేం ఫిర్యాదు చేయడం లేదు. కారు తర్వాతనైనా కొనక్కోవచ్చు. కష్టకాలంలో నా కేఐఐటీ యూనివర్సిటీ, ఒడిశా ప్రభుత్వం అండగా నిలిచింది. నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని కాదు. కానీ ఈ కష్టకాలంలో వారిపై భారం మోపడం నాకు ఇష్టం లేదు. ఈ కారు అమ్మడం ద్వారా వచ్చే డబ్బును నా ట్రైనింగ్కు ఉపయోగించి ఓడిశా ప్రభుత్వం, కేఐఐటీ యూనివర్సిటీపై భారం తగ్గించాలనుకుంటున్నా'అని ద్యుతీ వెల్లడించింది.
మిథాలీ రాజ్ వేటు వెనుక చాలా పెద్దోళ్లున్నారు: హర్మన్ప్రీత్ కౌర్