న్యూఢిల్లీ: జైలులో తనకు ప్రత్యేకమైన ఆహారం అందించాలని భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. జైలులో అందరూ సమానమేనని, ప్రత్యేక ఆహారం అందించడం కుదరదని పేర్కొంది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్ను ఢిల్లీ పోలీసులు గత నెలలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఒలింపిక్ మెడల్ విజేతను ప్రస్తుతం ఢిల్లీలోని మాండోలి జైలులోని ప్రత్యేక సెల్లో ఉంచుతున్నారు.
అయితే జైల్లో అందించే ఆహారంలో తనకు కావాల్సిన ప్రోటిన్ అందడం లేదని, రాబోయే టోక్యో ఒలింపిక్స్కు సిద్ధమవుతున్నందున ప్రోటీన్ సప్లిమెంట్స్, వ్యాయామ సామాగ్రి, ప్రత్యేక ఆహారం అందించాల్సిందిగా సుశీల్ కుమార్ తన లాయర్ ద్వారా ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. ప్రత్యేక ఆహారం కింద ఒమేగా 3 క్యాప్సూల్స్, మిల్క్ షేక్లు, ప్రీ-వర్కౌట్ సప్లిమెంట్స్, మల్టీవిటమిన్ మాత్రలు అందించాలని పిటిషన్లో కోర్టును కోరాడు.
కాగా సుశీల్ కుమార్ పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన కోర్టు.. ఢిల్లీ జైలు నిబంధనలు 2018 ప్రకారం అందిస్తున్న ఆహారంలో సమస్యలు ఉన్నట్లు పిటిషనర్ పేర్కొలేదని, దీన్ని బట్టి అతనికి సరైన ఆరోగ్యకరమైన డైట్ అందుతున్నట్లు అర్థం చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా సుశీల్ ఎలాంటి వ్యాధులతో బాధపడటం లేదని, చట్టానికి అందరూ సమానమేనని, అందర్నీ ఒకేలా ట్రీట్ చేస్తారని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టేసింది.
గత నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్లపై సుశీల్ కుమార్, అతని అనుచరులు దాడి చేశారు. అందులో సుశీల్ కుమార్ బేస్బాల్ బ్యాట్తో రాణాపై దాడి చేసిన వీడియోలు, ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. దాంతో సుశీల్ చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుసుకుంది. తొలుత పరారీలో ఉన్న సుశీల్.. ఆ తర్వాత పోలీసులకు చిక్కాడు. ఓ ఫ్లాట్ విషయంలోని గొడవ ఈ హత్యకు దారితీసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్యకేసుతో భారత్కు రెండు పతకాలు అందించిన సుశీల్ కుమార్ ప్రతిష్ట మసకబారింది. నార్త్ సెంట్రల్ రైల్వేలోని అతని ఉద్యోగం కూడా పోయింది.