బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్తో సరిపెట్టిన భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ వ్యక్తిగత విభాగాల్లో పసిడి పతకమే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు 21-4, 21-11 తేడాతో మాల్దీవ్స్ షట్లర్ ఫాతిమా నబా అబ్దుల్ రజాక్ను చిత్తుగా ఓడించి ప్రి క్వార్టర్స్కు చేరింది. ఈ పోటీలో సింధు వరుసగా రెండు సెట్లు గెలిచి కేవలం 21 నిమిషాల్లోనే సునాయాసంగా విజయం సాధించింది.
తొలి గేమ్లో ఫాతిమా తేలిపోగా రెండో గేమ్ తొలి భాగంలో కాస్త గట్టి పోటీనిచ్చింది. దీంతో ఒకానొక సమయంలో సింధుతో 9-9 స్కోర్తో సమంగా నిలిచింది. అయితే తర్వాత పుంజుకున్న సింధు రెండో గేమ్లో విరామ సమయానికి 11-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక తర్వాత మరింత చెలరేగిన భారత షట్లర్ ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 21-11తో మ్యాచ్ను సొంతం చేసుకుంది. తనదైన క్రాస్ కోర్ట్ షాట్స్తో సింధు ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ పోటీలో కిదాంబి శ్రీకాంత్.. ఉగాండాకు చెందిన డేనియల్ వానాగలియాను 21-9, 21-9 తేడాతో ఓడించి ప్రిక్వార్స్కు చేరాడు. గత కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు గెలిచిన సింధు, శ్రీకాంత్లు.. ఈ సారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు.
ఇక భారత బ్యాడ్మింటన్ మిక్సడ్ టీమ్ విభాగం రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. గత మంగళవారం అర్థరాత్రి మలేషియాతో జరిగిన మిక్స్డ్ టీమ్ ఫైనల్లో 3-1 తేడాతో ఓడిన భారత జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పీవీ సింధు మినహా మిగతావారు ఓటమి పాలవ్వడంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ముందుగా భారత షెట్లర్లు చిరాగ్ శెట్టి- సాత్విక్ సాయిరాజ్ మలేషియాకు చెందిన టెంగ్ ఫాంగ్ ఆరోన్ చియా,వూయి యిక్తో జరిగిన పురుషులు డబుల్స్ మ్యాచ్లో పరాజయం పాలయ్యారు. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 21-18,21-15 తేడాతో చిరాగ్-సాత్విక్ జంట ఓటమి చవిచూసింది. అనంతరం సింగిల్స్లో భాగంగా పీవీ సింధు.. మలేషియా స్టార్ జిన్ వెయ్-గోహ్ను 22-20, 21-17తో మట్టికరిపించి మ్యాచ్ గెలిచింది. మూడో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో భారత్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్.. మలేషియా షెట్లర్ జె యోంగ్ చేతిలో 21-19,6-21,21-16తో ఓడిపోయాడు. దీంతో మలేషియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక నిర్ణయాత్మకమైన నాలుగో మ్యాచ్ అయిన మహిళల డబుల్స్లో భారత్ జోడి త్రీసా జోలీ-గాయత్రి గోపిచంద్ చేతులెత్తేసింది. మలేషియన్ జంట మురళీధరన్ తీనా- కూంగ్ లే పెర్లీ టాన్ చేతిలో 21-18,21-17తో భారత్ జంట ఓటమి పాలవ్వడంతో భారత్ ఖాతాలో రజతం వచ్చి చేరింది.