
జకార్తా: ప్రతిష్టాత్మక క్రీడా సంరంభం ఆసియా గేమ్స్లో భారత్ ఇప్పటికే వుషూ విభాగంలో 4 పతకాలను దక్కించుకుంది. అయితే ఇదే ఈవెంట్లో జరిగిన మ్యాచ్లో ఇరాన్ ఆటగాడు మ్యాచ్తో పాటుగా అభిమానుల మనస్సులు దోచుకున్నాడు. ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో గాయపడిన ప్రత్యర్థి ఆటగాడిని ఎత్తుకుని అతని కోచ్ వద్దకు తీసుకుని వెళ్లాడు. ఇంతకీ ఆ ప్రత్యర్థి ఆటగాడు ఎవరో తెలుసా.. భారత్కు చెందిన సూర్య భాను ప్రతాప్.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
పోటీల్లో భాగంగా పురుషుల వుషూలో సందా 60 కేజీల విభాగంలో బుధవారం సెమీఫైనల్ పోటీలు జరిగాయి. ఇందులో భారత్కు చెందిన సూర్యభాను ప్రతాప్.. ఇరాన్కు చెందిన ఇర్ఫాన్తో తలపడ్డాడు. ఈ మ్యాచ్లో ప్రతాప్ ఓడిపోయాడు. మ్యాచ్ మధ్యలో కాలికి గాయం కావడంతో ప్రతాప్ విలవిలలాడిపోయాడు. సరిగా నిలబడలేకపోతున్నాడు, నడవలేకపోయాడు. మ్యాచ్ అనంతరం నిర్వాహకులు విజేతను ప్రకటించిన అనంతరం ప్రతాప్ బాధను గుర్తించిన ఇర్ఫాన్ అతన్ని ఎత్తుకుని భారత కోచ్ వద్దకు తీసుకెళ్లి దింపాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 'ఇర్ఫాన్ ఈ క్రీడల్లో నువ్వు స్వర్ణం గెలుస్తావో లేదో తెలియదు కానీ కోట్ల మంది భారతీయుల మనసులు గెలిచావు' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
ఈ మ్యాచ్లో ఓడిపోయిన సూర్యభాను ప్రతాప్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల వుషులో పలు విభాగాల్లో భారత్ 4 కాంస్య పతకాలు సాధించింది. ఐతే భారత్ వుషులో అత్యధిక పతకాలు సాధించిన ఆసియా క్రీడలు ఇవే కావడం విశేషం.