బెంగళూరు: ప్రొకబడ్డీ లీగ్ 2022 సీజన్ టైటిల్ను దబాంగ్ ఢిల్లీ సొంతం చేసుకుంది. పట్నా పైరేట్స్తో శుక్రవారం జరిగిన ఉత్కంఠకర ఫైనల్లో దబాంగ్ ఢిల్లీ ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందింది. ఫలితంగా తొలిసారి టైటిల్ను ముద్దాడింది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో దబాంగ్ ఢిల్లీ 37-36తో త్రీటైమ్ చాంపియన్ అయిన పట్నా పైరేట్స్ను ఓడించింది.
ఢిల్లీ జట్టులో విజయ 14, నవీన్ కుమార్ 13 పాయింట్లతో సత్తా చాటగా.. సందీప్ నర్వాల్, మంజీత్ చిల్లర్ చెరో రెండు పాయింట్లు రాబట్టారు. పట్నా టీమ్లో సచిన్, గుమన్ సింగ్, మహమ్మద్ రెజా 5, ప్రశాంత్ కుమార్ రెండు, నీరజ్ కుమార్ , సజిన్ తలో ఒక పాయింట్ సాధించారు. కీలక సమయంలో పట్నా పైరేట్స్ చేసిన తప్పిదాలు ఢిల్లీకి కలిసొచ్చాయి.
ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. అయితే ఫస్టాఫ్లో మాత్రం పట్నా పైరేట్స్ దూకుడు కనబర్చింది. సూపర్ రైడింగ్తో ఢిల్లీని ఆలౌట్ కూడా చేసింది. ఫస్టాఫ్ ముగిసే సరికి 12 రైడింగ్, 2 ట్యాకిల్, 2 ఆలౌట్, ఒక ఎక్స్ట్రా పాయింట్తో కలుపుకొని 17-15తో లీడ్లో నిలిచింది. ఇక సెకండాఫ్లో దుమ్మురేపిన ఢిల్లీ దబాంగ్.. పట్నా పైరేట్స్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. సూపర్ రైడింగ్, ట్యాకిల్తో ఆ జట్టును డిఫెన్స్లో పడేసింది. 15 రైడింగ్, 2 ట్యాకిల్, 2 ఆలౌట్, 3 ఎక్స్ట్రాలతో విజయకేతనం ఎగరేసింది.
మరోవైపు పట్నా పైరేట్స్ సైతం ధీటుగా బదులిచ్చినప్పటికీ.. ఢిఫెన్స్ విభాగం దారుణంగా విఫలమైంది. 17 రైడింగ్ పాయింట్స్ సాధించిన ఆ జట్టు కీలక సమయంలో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ చివరి నిమిషంలో 35- 36తో ఒక్క పాయింట్ తేడాలో వెనకంజలో నిలిచిన పట్నా.. ఢిల్లీ రైడర్ను ఔట్ చేయాలనే ఆతృతలో మరో పాయింట్ ఇచ్చుకుంది. ఆ తర్వాత రైడింగ్కు వెళ్లి ఒక్క పాయింట్ తెచ్చినా ఫలితం లేకపోయింది. చివరి రైడ్కు వచ్చిన ఢిల్లీ స్మార్ట్గా ఆడి తొలిసారి టైటిల్ను ముద్దాడింది.