|
డీఎస్పీ అజయ్ ఠాకూర్ ఆన్ డ్యూటీ..
అయితే భారత కబడ్డీ ప్లేయర్ అజయ్ ఠాకూర్ కూడా లాఠీలతో బ్యాటింగ్ చేస్తుండు. కబడ్డీ ప్లేయరేంటీ పోలీసుల్లా కొట్టడం ఏమిటీ అనుకుంటున్నారా? అవును కరోనా నేపథ్యంలో క్రీడా టోర్నీలు రద్దవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సమయాన్ని ఫ్యామీలీతో ఆస్వాదిస్తున్నారు. కానీ డీఎస్పీ హోదా కలిగిన అజయ్ ఠాకూర్ మాత్రం తన విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రజల రక్షణ కోసం సహచర పోలీసులతో రోడ్లపై శ్రమిస్తున్నాడు. అజయ్ ఠాకుర్ హిమాచల్ ప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అనే విషయం తెలిసిందే.
బిలాసాపూర్లో తన టీమ్తో గస్తీ..
కబడ్డీ కోర్టులో తన జట్టును నడిపించే అజయ్ ఠాకూర్.. బిలాసాపూర్లో డీఎస్పీ హోదాలో తన పోలీస్ టీమ్తో గస్తీ నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను ఈ పద్మశ్రీ అవార్డు గ్రహిత తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
దీనికి ‘ఆన్ డ్యూటీ.. మీరు ఇంకొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి. ఇతరులకు ఈ విషయం చెప్పండి. అడ్మినిస్టేషన్కు సహకరించండి. ఇదొక్కటే మార్గం'అనే క్యాప్షన్ ఇచ్చాడు.
21 రోజుల లాక్డౌన్..
ఇక కరోనా వైరస్ భారత్లో వేగంగా విజృంభిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల లాక్డౌన్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీస్ గస్తీకాస్తూ ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రాకుండా చూస్తున్నారు. ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య దేశంలో సుమారు 700కు చేరింది. 14 మంది మరణించారు.
ప్రజలు సీరియస్ తీసుకోవడం లేదు..
అయితే తన పాట్రోలింగ్ అనుభవాన్ని అజయ్ ఠాకూర్ ఓ యూట్యూబ్ వీడియో ద్వారా పంచుకున్నాడు. ‘ఇప్పటికి లాక్డౌన్ను ప్రజలు తీవ్రంగా పరిగణించడం లేదనే విషయాన్ని గ్రహించా. గ్రామాల్లోని కూడళ్ల వద్ద 10-15 మంది ఒక్కచోట గుంపులుగా చేరి మాట్లాడుకోవడం చూశా. దయచేసి సీరియస్ తీసుకోండి. ఇళ్లలోనే ఉండండి'అని అజయ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశాడు.