లుసానే: హాకీ ఆటకు మరింత ప్రాచుర్యం కల్పించి జనాలకు చేరువ చేసేందుకు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ 'హాకీ ఫైవ్స్' పేరిట సరికొత్త ఫార్మాట్ తీసుకొచ్చింది. టీ20 క్రికెట్, రగ్బీ సెవెన్స్, 3X3 బాస్కెట్ బాల్ మాదిరిగా హాకీలో షార్ట్, ఫాస్ట్ ఫార్మాట్ను తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా శనివారం నుంచి జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ఫైవ్స్ మొదటి ఎడిషన్ టోర్నీలో భారత్ సహా ఐదు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
పురుషుల్లో తమ తొలి మ్యాచ్లో భారత్, స్విట్జర్లాండ్తో పోటీ పడనుంది. శనివారమే జరిగే తదుపరి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది. మరోవైపు మహిళల సెక్షన్లో తొలి రోజు జరిగే పోటీల్లో తెలుగు అమ్మాయి ఎతిమరపు రజనీ కెప్టెన్సీలోని భారత్, ఉరుగ్వే, పోలెండ్తో పోటీ పడుతుంది.
ఫార్మాట్ ఎలా అంటే..?
హాకీ ఫైవ్స్లో ఒక్కో జట్టులో ఒక గోల్ కీపర్ సహా ఐదుగురు ప్లేయర్లు ఉంటారు. అన్ని జట్లు నలుగురు సబ్స్టిట్యూట్లను అందుబాటులో ఉంచుకోవచ్చు.
రెగ్యులర్ ఫీల్డ్తో పోలిస్తే ఈ ఫార్మాట్ ఫీల్డ్ సైజ్ సగమే ఉంటుంది. డి ఏరియా ఉండదు. ప్లేయర్లు ఎక్కడి నుంచి అయినా గోల్ కొట్టొచ్చు. ఈ మ్యాచ్కు 20 నిమిషాల సమయమే ఉంటుంది. 10 నిమిషాల తర్వాత బ్రేక్ ఇస్తారు. ఈ ఫార్మాట్ను 2013లో ప్రవేశ పెట్టగా.. 2014 యూత్ ఒలింపిక్స్లోనూ ఆడించారు.