హైదరాబాద్: సుదూరాలకు విడిపోయిన స్నేహితులు ఏదో టీవీ ఛానెల్లోనో.. వార్తా పత్రికలోనో కనిపించి వాళ్లిద్దరూ కలుసుకోవడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, అలాంటి ఘటన నిజంగా ఎదురైంది. అది కూడా 56ఏళ్ల తర్వాత ఇద్దరు చిన్నానాటి స్నేహితులు తిరిగి కలుసుకున్నారు. వీళ్లని కలిపింది.. తొలిసారి స్నేహం కుదిరేలా చేసింది కూడా 'ఫిఫా'నే. జూన్ 14న మొదలై మరి కొద్ది రోజుల్లో ముగియబోతున్న ఫిఫా.. ఓ బంధాన్ని మళ్లీ నిలబెట్టింది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఫిఫాలో దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఓ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కలుసుకున్నారు.
ఫిఫా వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
చైనాకు చెందిన క్రీడా పాత్రికేయుడు వీళ్లిద్దరినీ కలిపారు. రష్యాకు చెందిన ల్యూడ్మిలా మిత్రిచెవా ఇవానోవా, చైనాకుకు చెందిన దువాన్ చున్జియూ అనే ఇద్దరు 1962లో రష్యాలో జరిగిన ఓ వేడుకలో కలుసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అనంతరం దువాన్ చైనాకు వెళ్లిపోవడంతో ఒకరికొకరు ఉత్తరాలు రాసుకోవడం మొదలు పెట్టారు. అయితే, ఇది కూడా ఎన్నో రోజులు కొనసాగలేదు.
కొన్ని కారణాల వల్ల పరస్పరం ఉత్తరాలు రాసుకోవడం కూడా మానేశారు. అయితే ఈ ఏడాది రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్లో కవరేజ్ కోసమని చైనాకు చెందిన ఓ టీవీ ఛానెల్ అక్కడికి వచ్చింది. ఆ ఛానెల్కు చెందిన క్రీడా పాత్రికేయుడు, ఇవానోవా ఒకసారి అనుకోకుండా కలిశారు. ఆయనతో తన చిన్ననాటి స్నేహితురాలి గురించి ఇవానోవా పూసగుచ్చినట్లు చెప్పింది. అంతే ఆయన ఇవానోవా సమాచారాన్ని మీడియా ద్వారా చైనాలో ఉన్న దువాన్కు తెలియజేశాడు. దీంతో దువాన్ వెంటనే బయల్దేరి తన బాల్యమిత్రురాలి వద్ద వాలిపోయింది. దీంతో వారిద్దరి ఆనందానికి అవధుల్లేవు.
దీనిపై ఇవానోవా మాట్లాడుతూ...' నాకు పదిహేనేళ్ల వయసున్నప్పుడు దువాన్ నుంచి ఉత్తరం వచ్చింది. బదులుగా తనకు మూడు ఉత్తరాలు రాశాను. తిరిగి రెండు ఉత్తరాలే రాసి పంపింది. ' నా వయసు 15. నేను బాగా చదువుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను.' అని ఓ లేఖ రాసి దీంతోపాటు తన ఫొటోలు పంపింది. అదే నేను తన వద్ద అందుకున్న చివరి లేఖ' అని ఇవానోవా ఉద్వేగంతో తెలిపింది.