ఫుట్బాల్ ప్రపంచకప్ ఆడిన ఏకైక క్రికెటర్..
ఈ క్రమంలోనే ఫుట్బాల్ ప్రపంచకప్ ఆడిన దిగ్గజ క్రికెటర్ గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఒక ఆటగాడు బహుళ క్రీడలకు ప్రాతినిథ్యం వహించడం కొత్తేం కాదు. ఒలింపిక్స్లో ఇలాంటివి చాలా చూస్తుంటాం. కొందరు అథ్లెట్లు పలు ఈవెంట్లలో పాల్గొని పతకాలు కూడా కొట్టారు. టెన్నిస్ ప్లేయర్లను క్రికెట్ ఆడిన ఘటనలు ఉన్నాయి. అయితే ఓ దిగ్గజ క్రికెటర్ ఫుట్బాల్ ప్రపంచకప్ ఆడాడనే విషయం చాలా మందికి తెలియదు. అతను కూడా ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించినవాడు కావడం మరో విశేషం. అయితే అతను ఎవరో కాదు.. వెస్టిండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్.
1974 ప్రపంచకప్లో..
1970, 80 దశకాల్లో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. ఫుట్బాల్ ప్రపంచకప్ కూడా ఆడాడు. క్రికెట్ కంటే ముందే ఆయన ఫుట్బాల్ లో ప్రావీణ్యం సంపాదించాడు. క్రికెట్ ప్రపంచకప్ లు ఆడటానికి ముందే ఫుట్బాల్ ప్రపంచకప్లో పాల్గొన్నాడు. క్రికెట్ లోకి రిచర్డ్స్ 1974 లో ఎంట్రీ ఇచ్చాడు. అదే ఏడాది నిర్వహించిన ఫుట్బాల్ వరల్డ్ కప్ బరిలోకి దిగాడు. కరేబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫుట్బాల్ క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడాడు. కానీ ఆ టోర్నీలో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఆ తర్వాత 1975 (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్లలో కూడా భాగమయ్యాడు.
ఇతరులు ఆడినా..?
రిచర్డ్స్ కాకుండా క్రికెట్ ఆడుతూనే పలు లీగ్ లకు ఫుట్బాల్ ఆడిన క్రికెటర్లు కూడా ఉన్నారు. అయితే వీరెవ్వరూ రిచర్డ్స్ మాదిరిగా ఫిఫా వరల్డ్ కప్ ఆడలేదు. వారిలో ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్, చార్లెస్ బర్గెస్ ఫ్రై, డెనిస్ కాంప్టన్ (ఈ ఇద్దరిదీ ఇంగ్లాండ్), ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ కూడా క్లబ్స్ తరఫున ఫుట్బాల్ ఆడింది. భారత ఆటగాళ్లలో కూడా చాలా మందికి ఫుట్బాల్ ఆటలో మంచి ప్రావిణ్యం ఉంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ముందుగా ఫుట్బాల్నే తన కెరీర్గా ఎంచుకున్న విషయం తెలిసిందే.