న్యూఢిల్లీ: ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను ఫుట్ బాల్ అసోసియేషన్( ఫిఫా) సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయి కార్యవర్ణం లేకపోవడంతో పాటు ఫెడరేషన్కు సంబంధం లేని వ్యక్తలు జోక్యం ఉందని ఫిఫా ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 'థర్డ్ పార్టీల అతి జోక్యం ఉన్న కారణంగా ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఫిఫా కౌన్సిల్ బూర్యో ఏకగ్రీవంగా నిర్ణయించింది'' అని మంగళవారం ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది.
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) తన రోజువారీ వ్యవహారాలపై పూర్తి నియంత్రణను తిరిగి పొందే వరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. సస్పెన్షన్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 11-30 తేదీల్లో భారత్లో జరగాల్సిన ఫిఫా U-17 మహిళల ప్రపంచ కప్ 2022 టోర్నీపై అనిశ్చితి నెలకొంది. భారత్ నుంచి టోర్నీని మరో దేశానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీకి సంబంధించి తదుపరి చర్యలను అంచనా వేస్తున్నామని, అవసరమైతే కౌన్సిల్ బ్యూరోకు రెఫర్ చేయనున్నట్లు ఫిఫా తెలిపింది.
ఈ మేరకు భారత యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖతో నిరంతరం నిర్మాణాత్మక సంప్రదింపులు జరుపుతున్నామని, ఇందుకు సంబంధించి సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావంతో ఉన్నామని ఫిపా పాలకమండలి తెలిపింది. మరోవైపు భారత ఫుట్బాల్ ప్లేయర్లంతా ఫుట్బాల్ అసోసియేషన్(ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని ఛెత్రి అన్నాడు. అఖిల భారత ఫుట్బాల్ అసోసియేషన్ చాలా కాలంగా అడ్హక్ కమిటీతో నడుస్తోంది.