న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కూడా ఒక్కరోజులో అవకాశాలు ఒడిసిపట్టుకోలేదు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు కాస్త సమయం పడుతుంది. పంత్ కుదురుకునే వరకు టీమిండియా ఓపికగా ఉండాలని మాజీ డాషింగ్ బ్యాట్స్మన్ యువరాజ్ సింగ్ కోరారు. ధోనీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న పంత్కు ఇటీవలి కాలంలో పదే పదే జట్టులో స్థానం ఇస్తున్నారు. అయినా పంత్ పరుగులు చేయలేకపోతున్నాడు. వెస్టిండీస్ సిరీస్లో తనకు అలవాటైన చెత్త షాట్లకు ఔటైన సంగతి తెలిసిందే. పంత్ తన చివరి ఆరు ఇన్నింగ్స్లలో కేవలం 77 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఐదు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.
న్యూజిలాండ్ పర్యటనలో అండర్సన్, బెయిర్స్టోలకు దక్కని చోటు.. కొత్తవారికి అవకాశం
ఇక ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్లో కూడా 4, 19 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటికే కోచ్ రవిశాస్త్రి పంత్ ఆటతీరుపై ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హెచ్చరించాడు. వీరితో పాటు పలువురు మాజీలు పంత్ ఆట తీరును మార్చుకోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మాత్రం ఘాటుగా స్పందించాడు. పంత్కు ఇచ్చిన అవకాశాలు ఇక చాలు, సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకోవాలన్నాడు. అయితే పంత్కు యువరాజ్ మద్దతుగా నిలిచాడు.
తాజాగా యువరాజ్ మాట్లాడుతూ... 'అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనీ కూడా ఒక రోజులో అవకాశాలు అందిపుచ్చుకోలేదు. అతనికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి ధోనీ భర్తీకి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా ఒక సంవత్సరం ఉంది. పంత్పై విమర్శలు ఆపండి. ధోనితో పోల్చుతూ పంత్పై ఒత్తిడి తెస్తున్నారు. పంత్కు అవకాశాలు ఇచ్చారు. కానీ.. అతడికి సమయం పడుతుంది. రిషభ్ పంత్ ఆట తీరుపై కాస్త ఓపిక పట్టండి' అని అన్నారు.
'పంత్పై ఒత్తిడి పెంచితే ఆటపై ప్రభావం చూపుతుంది. అతనిలో మ్యాచ్లను గెలిపించే సత్తా ఉంది. అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పరుగులు చేసేలా స్వేచ్ఛ ఇవ్వాలి. జట్టులో అతనిని పర్యవేక్షించే వ్యక్తులు కోచ్, కెప్టెన్.. పంత్కు మెంటార్గా వ్యవహరిస్తే గాడిలో పడితాడు. పంత్పై అదేపనిగా వ్యాఖ్యలు చేయడం ఆపండి' అని యువరాజ్ పేర్కొన్నారు.
తాజాగా అజిత్ అగార్కర్ కూడా స్పందించాడు. 'మంచి ఇన్నింగ్స్లతో విదేశీ పర్యటనల్లో రెండు టెస్ట్ సెంచరీలు చేసిన యువ ఆటగాడిపై చర్చలు జరగడం నమ్మలేకపోతున్నా. టీ20ల్లో ధాటిగా ఆడే క్రమంలో ఇబ్బందుల్లోకి వెళుతారు. కీలక సమయాల్లో షాట్లు ఆడవలసి ఉంటుంది. ఈ క్రమంలో అతడు ఆడాలనుకున్నట్లు ఆడలేకపోతున్నాడు. పంత్కు ఒక నిర్దిష్ట స్థానం కల్పించి, శ్రేయస్ అయ్యర్ని నాలుగో స్థానానికి పరిమితం చేయాలి. అంతర్జాతీయ క్రికెట్లో అతితక్కువ అనుభవమున్న ఆటగాడిపై అనవసర ఒత్తిడి నెలకొంది. టీమిండియాకు విజయాల్ని అందించే సత్తా అతడికి ఉంది' అని పేర్కొన్నాడు.