
ముంబై: దేశంకోసం ప్రపంచకప్ గెలిచినప్పుడు వచ్చే ఆ ఆనందంను మాటల్లో చెప్పలేం అని మాజీ డాషింగ్ బ్యాట్స్మన్, ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ అన్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్ గెలిచి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భాన్ని యువరాజ్ గుర్తుచేసుకున్నాడు. 2007 సెప్టెంబర్ 24న దక్షిణాఫ్రికాలో భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో యువీ మెరుపులను అభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.
టీ20 ప్రపంచకప్ గెలిచి సందర్భాన్ని యువీ మంగళవారం గుర్తుచేసుకున్నారు. 'దేశం కోసం ప్రపంచకప్ గెలిచినప్పుడు వచ్చే స్వచ్ఛమైన ఆనందం. ఆ ఆనందంను ఎప్పటికి మాటల్లో చెప్పలేం. వెలకట్టలేని మధురస్మృతులు' అని యువీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్సులతో టీ20 ప్రపంచకప్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు.
దర్బన్లో ఇంగ్లాండ్పై పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో వరుసగా ఆరు సిక్సర్లు బాది చరిత్ర సృష్టించాడు. అంతేకాదు టీ20ల్లో అత్యంత వేగంగా 12 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత జరిగిన సెమీస్లో ఆస్ట్రేలియాపై 5 బౌండరీలు, 5 సిక్సర్లతో 30 బంతుల్లోనే 70 పరుగులు చేసి జట్టుకు 187 పరుగుల భారీ స్కోరు అందించాడు. టీ20 ప్రపంచకప్ విజయాన్ని బీసీసీఐ, మాజీ క్రికెటర్లు కూడా గుర్తు చేసుకున్నారు.
బీసీసీఐ కూడా ఈ ప్రత్యేక విజయాన్ని గుర్తుచేస్తూ.. శ్రీశాంత్ క్యాచ్ పట్టిన వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. '2007లో ఈ రోజున టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది' అని కాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు ఈ వీడియోకు లైకులు, కామెంట్లు పెడుతున్నారు. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్తో భారత్ తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 75 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. చివరి ఓవర్లో ఊహించని రీతిలో శ్రీశాంత్ బంతిని ఒడిసిపట్టుకోవడంతో భారత్ విజేతగా నిలిచింది.