హైదరాబాద్: భుజం గాయంతో బాధపడుతోన్న టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహాకు ఇంగ్లాండ్లో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ శనివారం అధికారిక ప్రకటన చేసింది. భుజం నొప్పి తీవ్రంగా వేధిస్తుండటంతో లండన్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కొంతకాలం పాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. నేషనల్ క్రికెట్ అకాడమీలో సదుపాయాల పట్ల విమర్శలు వస్తుండటంతో టీమిండియా సీనయర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇలా ఖండించాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)పై వస్తున్న విమర్శలలో నిజం లేదంటూ తేల్చేశాడు. ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్, ఫామ్ సాధించడంలో అకాడమీ ఎనలేని పాత్ర పోషిస్తోందని ప్రశంసించాడు. వేలి గాయం నుంచి కోలుకునేందుకు వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా ఎన్సీఏలో ఫిజియోల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నాడు.
Hearing criticisms abt NCA. I wud like to share my experience that the reason why I was able to bounce back aftr cancer was the national cricket academy a great facility created by @bcci to help players recover frm injuries with the help of best Physios & trainers in the country
— yuvraj singh (@YUVSTRONG12) July 20, 2018
ఈ క్రమంలోనే అతని భుజం గాయం తిరగబెట్టి తీవ్రమైందని, దీనికి ఎన్సీఏ, ఫిజియోలు కారణమని విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో యువీ స్పందించాడు. క్యాన్సర్ చికిత్స చేయించుకున్న తరువాత తాను మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి అకాడమీనే సాయపడిందని తెలిపాడు. ఎన్సీఏపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నానని వివరించాడు.
'నేను క్రికెట్లోకి పునరాగమనం చేయడానికి అకాడమీ ఎంతో సాయపడింది. అత్యున్నత సౌకర్యాలతో బీసీసీఐ నెలకొల్పిన అకాడమీలో ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతోంది. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఫిజియోలు, ట్రైనర్లు ఇందులో ఉన్నారని యువీ ట్విటర్ ద్వారా పేర్కొన్నాడు.