సౌతాంప్టన్: న్యూజిలాండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత్ పోరాడుతోంది. రిజర్వ్ డే అయిన ఆరో రోజు ఆరంభంలోనే టీమిండియా విరాట్ కోహ్లీ(13), , చతేశ్వర్ పుజారా(15), అజింక్యా రహానే(15) మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కివీస్ స్టార్ పేసర్ కైల్ జెమీసన్ వరుస ఓవర్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ(13), చతేశ్వర్ పుజారా(15)ను చేయగా.. క్రీజులో కుదురుకున్న రహానేను ట్రెంట్ బౌల్ట్ బోల్తాకొట్టించాడు. ఆ తర్వాత రిషభ్ పంత్( 28 బ్యాటింగ్), జడేజా(12 బ్యాటింగ్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో లంచ్ బ్రేక్ సమాయిని టీమిండియా 5 వికెట్లకు 130 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 98 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు 64/2 ఓవర్నైట్ స్కోర్తో రిజర్వ్ డే సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పర్ఫెక్ట్ ప్లాన్తో బౌలింగ్ చేసిన జెమీసన్ మరోసారి భారత్ను కోలుకోలేని దెబ్బతీశాడు. అప్పటి వరకు ఇన్సైడ్ స్వింగర్స్ వేసి ఒత్తిడి పెంచిన అతను ఆ తర్వాత ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసి ఫలితం రాబట్టాడు. అతను వేసిన 37 ఓవర్ ఐదో బంతికి కోహ్లీ ఔటవ్వగా.. 38వ ఓవర్ మూడో బంతికి పుజారా అదే తరహా ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ను ఆడి వెనుదిరిగాడు. ఓవర్నైట్ స్కోర్కు కోహ్లీ 5 పరుగులే జత చేయగా.. పుజారా ఒక పరుగు మాత్రమే చేసి పేలవ షాట్లతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఫస్ట్ సెషన్ ఫస్ట్ అవర్లోనే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడి నెలకొంది.
క్రీజులోకి వచ్చిన పంత్ వచ్చి రావడంతోనే తనదైన బౌండరీతో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. కానీ అదే జోరులో జెమీసన్ బౌలింగ్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతను ఇచ్చిన సునాయస క్యాచ్ను స్లిప్లో సౌథీ జారవిడచడంతో పంత్తో పాటు భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిస్థితులో వైస్ కెప్టెన్ రహానే బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. 37 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ బౌల్ట్ వీడదీసాడు.
లెగ్ స్టంప్కు వేసిన బంతిని ఆడే ప్రయత్నంలో రహానే కీపర్ క్యాచ్ వెనుదిరిగాడు. దాంతో ఫస్ట్ సెషన్ మొత్తం న్యూజిలాండ్ ఆధిపత్యమే కొనసాగింది. ఓటమి నుంచి గట్టెక్కాలంటే భారత్ సెకండ్ సెషన్ చివరి వరకు ఆడాల్సిందే. ఆడటమే కాకుండా పరుగులు చేయాలి. 200+ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితేనే టీమిండియా సేఫ్గా ఉండనుంది.