కోల్కతా: కరోనా వైరస్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తమ నివాస స్థలంలోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. తాను ఉంటున్న అపార్ట్మెంట్లోనే తండ్రి సాయంతో వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు.
'మా ఫ్లాట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని ప్రాక్టీస్కు ఉపయోగించుకుంటున్నా. సాఫ్ట్ బాల్తో క్యాచ్లు పడుతున్నా. బంతిని గోడకేసి కొట్టి క్యాచ్లుగా పట్టేందుకు శ్రమిస్తున్నా. దీనికి మా నాన్న ప్రశాంత సాహా సాయమందిస్తున్నారు. నేను చేసే ప్రాక్టీస్కు ఈ స్థలం, మా నాన్న సాయం సరిపోతుంది. అటు ఇటు కీపింగ్ క్యాచింగ్ చేస్తున్నాను. లాక్డౌన్తో బయటికి వెళ్లకుండానే కీపింగ్ డ్రిల్స్ చేస్తున్నా. రన్నింగ్కు వీల్లేకపోయినా అపార్ట్మెంట్ లోపలే వాకింగ్తో సరిపెట్టుకుంటున్నా. పూర్తిస్థాయి జిమ్ లేదు కానీ అందుబాటులోని ఎక్సర్సైజ్ సామాగ్రితో రోజు కసరత్తు చేస్తున్నా' అని సాహా చెప్పాడు.
ఇక భారత తుది జట్టుపై టీమిండియా మేనేజ్మెంట్ ఓ నిర్ణయానికి వస్తే దానిపై చర్చించాల్సిన అవసరం లేదని సాహా అభిప్రాయపడ్డాడు. 'భారత తుది జట్టులో వేటుపై నేను ఎప్పుడూ ఒత్తిడికి గురవలేదు. టీమిండియా మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే దానిపై ఇక చర్చ అనవసరమని నా ఫీలింగ్. వేటుపై ఓవర్గా రియాక్ట్ అవడం నాకు మొదటి నుంచి అలవాటు లేదు. అలానే సెంచరీ చేసినా లేదా డకౌటైనా ఒకేరీతిలో ఉంటా. ఆఖరికి టీమ్లో ఛాన్స్ దక్కకపోయినా.. నేను భావోద్వేగానికి గురవ్వను' అని సాహా వెల్లడించాడు.
2014 చివర్లో టెస్టులకి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా.. 2018 వరకూ ఆ ఫార్మాట్లో తొలి వికెట్ కీపర్గా సాహా కొనసాగాడు. కానీ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో టెస్టు సెంచరీలు బాదిన రిషబ్ పంత్ రేసులోకి దూసుకు రావడంతో టీమిండియా మేనేజ్మెంట్.. భారత్ వేదికగా జరిగే టెస్టుల్లో సాహాకి.. విదేశాల్లో పంత్కి అవకాశాలిస్తోంది. న్యూజిలాండ్ పర్యటనలో కూడా సంప్రదాయక ఫార్మాట్లో పంత్కే అవకాశం కల్పించింది.
కరోనా దెబ్బతో హైదరాబాద్ ఓపెన్ రద్దు!