ముంబై: మహిళల ఐపీఎల్ టీమ్స్ వేలం ప్రక్రియ ద్వారా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పంట పండింది. ఊహించినదానికంటే ఎక్కువ సంపద బోర్డు ఖాతాలో వచ్చి చేరింది. ఐదు జట్ల విక్రయాల ద్వారా రూ.4,669.99 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. అహ్మదాబాద్, మంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో బేస్ ఫ్రాంచైజీల కోసం మొత్తం 30 కంపెనీలు పోటీపడగా.. అత్యధిక ధరను బిడ్ వేసిన ఆదాని గ్రూప్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, కాప్రి గ్లోబల్ సంస్థలు మహిళా ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేసింది.
𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.
— BCCI (@BCCI) January 25, 2023
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH
మహిళల ప్రీమియర్ లీగ్కు సంబంధించిన సక్సెస్ఫుల్ బిడ్డర్స్ వివరాలను బుధవారం వెల్లడించింది. టీమ్స్ విక్రయాల ద్వారా రూ.4669.99 కోట్లు బోర్డుకు సమకూరాయని పేర్కొంది. అహ్మదాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీని ఆదాని స్పోర్ట్స్ లైన్ ప్రైయివేట్ లిమిటెడ్ రూ. 1289 కోట్లకు కొనుగోలు చేయగా.. ముంబై ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్కు చెందిన ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.912.99 కోట్లకు సొంతం చేసుకుంది. బెంగళూరు ఫ్రాంచైజీని రాయల్ చాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.901 కోట్లకు, ఢిల్లీ ఫ్రాంచైజీని జేఎస్డబ్ల్యూ జీఎమ్ఆర్ క్రికెట్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.810 కోట్లకు సొంతం చేసుకుంది. కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ లక్నో ఫ్రాంచైజీని రూ. 757 కోట్లకు దక్కించుకుంది. అహ్మదాబాద్ బేస్డ్ ఫ్రాంచైజీ అత్యంత విలువైన జట్టుగా నిలిచింది.
పురుషుల ఐపీఎల్కు చెందిన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు మాత్రమే మహిళల ఐపీఎల్లో భాగం కానున్నాయి. చివరి నిమిషంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నోసూపర్ జెయింట్స్ తప్పుకోగా.. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ టీమ్స్ కోసం ప్రయత్నించాయి.
The @BCCI has named the league - Women's Premier League (WPL). Let the journey begin....
— Jay Shah (@JayShah) January 25, 2023
ఇక మహిళల ఐపీఎల్ను బీసీసీఐ.. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)గా నామకరణం చేసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ అని పిలవాలని కోరాడు. ఈ లీగ్ మహిళల క్రికెట్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని తెలిపాడు. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ మీడియా రైట్స్ను రూ.951 కోట్లకు వయాకామ్ సంస్థ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల వరకు వయాకామ్ సంస్థనే బ్రాడ్కాస్టర్గా వ్యవహరించనుంది.