హైదరాబాద్: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఈ టోర్నీలో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హర్మన్ప్రీత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టో్ర్నీలో అంతకముందు మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక జట్లపై భారత్ మహిళల జట్టు విజయాల్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు, మహిళల ఆసియా కప్లో భారత మహిళల జట్టు తిరుగులేని రికార్డుని నెలకొల్పింది. ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ టోర్నీ జరగగా.. ఆరు పర్యాయాలు విజేతగా నిలిచిన భారత జట్టు.. తాజాగా జరుగుతున్న ఏడో సీజన్లోనూ ఫైనల్కి చేరింది. ఆదివారం బంగ్లాదేశ్తో ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. టోర్నీ తొలి సీజన్ నుంచి భారత్ విజేతగా నిలిచిన తీరుని ఓసారి పరిశీలిస్తే.
2004లో వన్డే ఫార్మాట్లో ప్రారంభమైన ఆసియా కప్ ఆ తర్వాత టీ20 ఫార్మాట్లోకి మార్పులకు గురైంది. ఈ ఫార్మాట్కు తొలిసారి శ్రీలంక ఆతిథ్యమివ్వగా.. 2005వ సంవత్సరంలో పాకిస్థాన్, 2006వ సంవత్సరంలో భారత్, 2008వ సంవత్సరంలో మళ్లీ శ్రీలంకలో ఈ టోర్నీ జరిగింది. 2012వ సంవత్సరంలో చైనా, 2016వ సంవత్సరంలో థాయ్లాండ్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగగా.. తాజాగా మలేషియాలోని కౌలాలంపూర్తో జరుగుతోంది.
2004వ సంవత్సరంలో శ్రీలంకపై గెలిచిన భారత్ జట్టు తొలి విజేతగా రికార్డు నెలకొల్పగా.. 2005, 2006, 2008 ఫైనల్లోనూ శ్రీలంక జట్టుపైనే గెలిచి కప్ని చేజిక్కించుకుంది. అనూహ్యంగా 2012, 2016 ఫైనల్లోనూ పాకిస్థాన్పై గెలిచి టైటిల్ను గెలిచింది.