చెన్నై భారీ స్కోర్
చెన్నై కెప్టెన్ ధోనీ 75 (46 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగుల చేసి ఓటమిని ఎదుర్కొంది. బెన్ స్టోక్స్ 46 (26 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా చెన్నై విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.
ధోనీ మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... "మూడు వికెట్లు కోల్పోయినప్పుడు జట్టుకు ఓ మంచి భాగస్వామ్యం అవసరం. అలాంటి సమయంలో రెండు మంచి భాగస్వామ్యాలు లభించాయి. మైదానంలో మంచు ఉంది.. అయితే భాగస్వామ్యాలే మ్యాచ్ని నిలబెట్టాయి. జట్టులో లోతైన బ్యాటింగ్ లైన్ అప్ ఉంది. శాంట్నర్ వరకు బ్యాటింగ్ చేయగల వారు జట్టులో ఉన్నారు" అని అన్నాడు.
తుది జట్టులోకి శాంట్నర్
'ప్రత్యర్థి జట్టులో రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఎక్కువగా ఉండడంతో తుది జట్టులోకి శాంట్నర్ను తీసుకున్నాం. అంతేగాని జట్టులో ప్రతీసారి మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అయితే టోర్నమెంట్లో ప్రత్యర్థి జట్ల ఆధారంగా జట్టులోని ప్రతీ ఒక్కరికీ అవకాశం ఇస్తాం. స్పిన్నర్లు జడేజా, సాంట్నర్ బంతిపై గ్రిప్ సాధించలేకపోయారు. ఇద్దరూ కూడా చాలా కష్టపడ్డారు" అని ధోనీ తెలిపారు.
ఇమ్రాన్ తాహిర్ అద్భుతం
"అయితే ఇమ్రాన్ తాహిర్ మాత్రం చాలా బాగా బౌల్ చేశాడు. సొంత మైదానంలో ఆడే ప్రతీ జట్టుకు అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది, అదే జట్టుకు బలం. అభిమానుల మద్దతు క్రికెట్ ఆటలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అభిమానులు చాలా డబ్బులు ఖర్చుపెట్టి వస్తారు, ఏ జట్టుకు మద్దతు ఇస్తున్నారో పట్టించుకోను" అని ధోనీ చెప్పుకొచ్చారు.