హైదరాబాద్: పాకిస్థాన్తో ద్వైపాక్షికి సిరిస్లు ఆడాలని భారత్ను తాము రిక్వెస్ట్ చేయబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ ఇషాన్ మణి స్పష్టం చేశారు. 2014లో బీసీసీఐ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ జట్టు పాకిస్థాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడాల్సి ఉంది.
అయితే, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో భారత్ ఈ సిరీస్లు ఆడేందుకు గత నాలుగేళ్లుగా నిరాకరిస్తూ వస్తోంది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని ఆశ్రయించింది. అంతేకాదు తమకు నష్టపరిహారం కింద 70 మిలియన్ డాలర్లను బీసీసీఐ చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ముగ్గురు సభ్యుల కమిటీ పాక్ బోర్డు వేసిన పిటిషన్పై విచారణ జరపనుంది.
ఈ విషయంలో కమిటీ నిర్ణయమే ఫైనల్ అని ఇప్పటికే ఐసీసీ స్పష్టంచేసింది. ఈ వివాదంపై అక్టోబరు 1 నుంచి 3 వరకు ఐసీసీ కమిటీ విచారణ జరపనుంది. ఈ విచారణలో భాగంగా ఐసీసీ వివాదాల పరిష్కార బోర్డు ఎదుట తమ వాదనలు వినిపించే ముందు దీనిపై భారత ప్రభుత్వ విధానాన్ని బీసీసీఐ ఇప్పటికే తెలుసుకుంది.
ఐసీసీ విచారణ తీరుపై ఇషాన్ మణి మాట్లాడుతూ "పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్లు ఆడాలని భారత్ని మేము అభ్యర్థించబోం. భారత్ నాలుగేళ్లుగా ఓ విరుద్ధమైన విధానంతో వెళ్తోంది. ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్, ఆసియా కప్ లాంటి టోర్నీల్లో పాకిస్థాన్తో మ్యాచ్లు ఆడేందుకు భారత్ ఎలాంటి అభ్యంతరాలు తెలపడం లేదు" అని అన్నారు.
"కానీ.. ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు మాత్రం ఎక్కడలేని అభ్యంతరాలు తెలుపుతోంది. 2014లో కుదిరిన ఒప్పందంపై ఇప్పటికే ఐసీసీని ఆశ్రయించాం.. తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం" అని కొత్త పీసీబీ అధ్యక్షుడు ఇషాన్ మణి స్పష్టం చేశారు. ఆసియా కప్లో భాగంగా భారత్-పాక్ జట్లు అంతర్జాతీయ వేదికగా తలపడనున్నాయి.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 15 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య సెప్టెంబర్ 19న మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్లో పాల్గొనే భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహారించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.