
హైదరాబాద్: టీమిండియా సీనియర్ సెలక్షన్ కమిటీపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. వచ్చే జనవరిలో శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20, వన్డే సిరీస్లకు సూర్యకుమార్ యాదవ్ని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.
భజ్జీ తన ట్విట్టర్లో "సూర్యకుమార్ యాదవ్ చేసిన తప్పు ఏమిటని నేను ఆశ్చర్యపోతున్నాను? టీమిండియా, ఇండియా ఏ, ఇండియా బీలకు ఎంపికయ్యే ఆటగాళ్ల మాదిరే పరుగులు చేస్తున్నాడు కదా? అయినప్పటికీ వేర్వేరు ఆటగాళ్లకు వేర్వేరు నియమాలు ఎందుకు?" అని ప్రశ్నించాడు.
29 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ 73 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 4920 పరుగులు చేశాడు. యావరేజి 43.53గా ఉంది. ఇందులో 13 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, 149 టీ20లు ఆడి 31.37 యావరేజితో 3012 పరుగులు చేశాడు. వడోదర వేదికగా ఇటీవలే బరోడాతో జరిగిన రంజీ ట్రోఫీలో 102 పరుగులతో సెంచరీతో చెలరేగాడు.
ఫలితంగా ముంబై 309 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఇప్పటివరకు మొత్తం 85 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 1548 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా, వచ్చే జనవరి 5 నుంచి శ్రీలంకతో టీమిండియా మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.
ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ జరగనుంది. ఈ సిరిస్ జనవరి 14 నుంచి 19 వరకు జరగనుంది. ఈ రెండు సిరిస్ల కోసం సెలక్టర్లు సోమవారం జట్లను ప్రకటించారు.
శ్రీలంకతో టీ20 సిరీస్కు టీమిండియా:
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, నవ్దీప్ సైని, శార్దూల్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్.
ఆస్ట్రేలియాతో వన్డే సిరిస్కు టీమిండియా:
విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, నవ్దీప్ సైని, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా.