గబ్బా టెస్ట్తో దూసుకొచ్చి..
2018లో వెస్టిండీస్తో టెస్ట్ ఆరంగ్రేటం చేసినా గాయంతో ఆ మ్యాచ్ ఆడలేకపోయిన శార్దూల్ ఠాకూర్.. 2021లో గబ్బా టెస్టు ద్వారా అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు. అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లో దుమ్మురేపే పర్పామెన్స్తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ ప్రదర్శనతో బౌలింగ్ ఆల్రౌండర్ అందరి ప్రశంసలు అందుకున్న ఈ ముంబైకర్.. 2021 ఇంగ్లండ్ పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్లో భారత్ అందుకున్న విజయాల్లో కీ రోల్ పోషించాడు. నాటింగ్హమ్లో జరిగిన తొలి టెస్టులో నాలుగు వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, గాయం కారణంగా ఆ తర్వాతి రెండు టెస్టులు ఆడలేదు.
అశ్విన్ కాదని అవకాశం ఇస్తే..
ఓవల్లో జరిగిన నాలుగో టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్, బౌలింగ్లో మూడు వికెట్లు తీయడమే కాకుండా.. రెండు ఇన్నింగ్స్ల్లోనూ హాఫ్ సెంచరీలు చేసి బ్యాటుతో భళా అనిపించాడు. ప్రత్యర్థి జట్లకి కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ను ఆ మ్యాచ్లో రెండు సార్లు ఔట్ చేశాడు. ఆ ప్రదర్శనతోనే రవిచంద్రన్ అశ్విన్ను కాదని టీమ్మేనేజ్మెంట్ శార్దూల్ ఠాకూర్కు అవకాశం ఇచ్చింది. కానీ అతను మాత్రం ఎడ్జ్బాస్టన్ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు.
ఎంగేజ్మెంట్ అనంతరం ఆటలో మార్పు..
గతేడాది నవంబర్లో మిట్టలీ పరూల్కర్తో శార్దూల్ ఠాకూర్కు ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఆ క్షణం నుంచి శార్దూల్ ఆటలో తేడా మొదలైంది. ఫిట్నెస్ కూడా కోల్పోయిన శార్దూల్ ఠాకూర్. మైదానంలో ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. 2021 వరకూ శార్దూల్ ఠాకూర్ ఆడిన ఏ టెస్టులోనూ భారత జట్టు ఓడిపోలేదు. అయితే ఈ ఏడాదిలో శార్దూల్ ఠాకూర్ ఆడిన మూడు టెస్టుల్లోనూ భారత జట్టుకి ఓటమి తప్పలేదు. ఐపీఎల్ 2018 నుంచి 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆడిన శార్దూల్ ఠాకూర్, 2022 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు మారాడు. ఇది కూడా శార్దూల్ ఠాకూర్ వైఫల్యానికి ఓ కారణంగా చెప్పవచ్చు. ధోనీ గైడెన్స్లోనే రాటు దేలిన ఠాకూర్.. అతనికి దూరమవ్వడంతో విఫలమవుతున్నాడనే వాదన వినిపిస్తోంది.
ఇట్లయితే కష్టమే..
గత ఐపీఎల్ సీజన్లో 21 వికెట్లు తీసిన శార్దూల్.. సీఎస్కేకి టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో శార్దూల్ను వేలంలో రూ.10.75 కోట్ల భారీ మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో శార్దూల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. బౌలింగ్లో 15 వికెట్లు తీసిన శార్దూల్, 9.79 ఎకానమీతో బౌలింగ్ చేసి గతంలో కంటే ఎక్కువ పరుగులు సమర్పించాడు. ఇక అతి తక్కువ సమయంలో టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన శార్దూల్ ఠాకూర్, ఇలాంటి పర్పామెన్స్ కొనసాగిస్తే.. జట్టులో చోటు కోల్పోవాల్సి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.