|
ధావన్, కోహ్లీ భాంగ్రా డ్యాన్స్
ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శిఖర్ ధావన్ కూడా తనదైన శైలిలో భాంగ్రా డ్యాన్స్ చేస్తూ వెళ్లాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ వార్మప్ మ్యాచ్లో బాట్స్మెన్ ఆధిపత్యం చూపెట్టినా.. బౌలర్లు కూడా తీవ్రంగానే శ్రమించారు.
వార్మప్ మ్యాచ్తో వెలుగులోకి సానుకూలాంశాలు
ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్-భారత్ మధ్య ఆగస్టు 1నుంచి జరిగే టెస్టు సిరీస్కు అదిరిపోయే ఆరంభాన్నివ్వాలని భావిస్తున్న కోహ్లీసేన ఈ వార్మప్ మ్యాచ్తో చాలా సానుకూలాంశాలు వెలుగులోకి వచ్చాయి. బ్యాటింగ్లో కొనసాగుతున్న సందేహాలకు పూర్తిగా తెరపడగా, బౌలింగ్లో లోపాలను సరిచూసుకునే అవకాశం దక్కింది.
తొలి టెస్టులో టీమిండియా నుంచి మెరుగైన ప్రదర్శన
దీంతో ఆగస్టు 1న బర్మింగ్ హామ్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో టీమిండియా నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించొచ్చు. 237/5 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్ను 94 ఓవర్లలో 8 వికెట్లకు 359 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫలితంగా భారత్కు 36 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు మొత్తం పేసర్లతో బౌలింగ్ చేయించిన కోహ్లీ చివర్లో జడేజాను రంగంలోకి తెచ్చాడు.
9 ఓవర్లు వేసిన కుల్దీప్, అశ్విన్
ఇక మూడో రోజు కుల్దీప్, అశ్విన్లను ప్రయోగించినా.. ఎక్కువసేపు వాళ్లతో బౌలింగ్ చేయించలేదు. ఇద్దరు కలిసి కేవలం 9 ఓవర్లు మాత్రమే వేసినప్పటికీ వికెట్లు మాత్రం తీయలేకపోయారు. ఆ తర్వాత స్వింగ్ను అందిపుచుకున్న ఉమేశ్ (4/35), ఇషాంత్ (3/59).. ఫోస్టర్ను కట్టడి చేశారు. ఇన్నింగ్స్ 70వ ఓవర్లో ఫోస్టర్ను ఔట్ చేయడంతో ఆరో వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ధావన్ డకౌట్
వెంటనే కోల్స్ (0) ఔటైనా.. చివర్లో నిజ్జర్ (29 నాటౌట్), ఖుషి (14 నాటౌట్) వేగంగా ఆడి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 21.2 ఓవర్లలో 2 వికెట్లకు 89 పరుగులు చేసింది. ధావన్ (0) మరోసారి నిరాశపర్చాడు. ఓపెనింగ్లో దిగిన రాహుల్ (36 నాటౌట్) మెరుగ్గా ఆడటంతో ఓపెనింగ్లో మరో ప్రత్యామ్నాయం దొరికినట్లయింది.
పుజారా మరోసారి విఫలం
భారీ ఆశలు పెట్టుకున్న పుజారా (23) మరోసారి విఫలమయ్యాడు. దీంతో భారత్ 40 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. రాహుల్తో కలిసి రహానే (19 నాటౌట్) ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. మధ్యలో వరుణుడు అడ్డుకోవడంతో గంటన్నర ముందుగానే మ్యాచ్ను నిలిపేశారు.