పీఎస్ఎల్ కన్నా ఐపీఎల్ పెద్దది
మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్తో యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన వసీం అక్రమ్ ఐపీఎల్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం బీసీసీఐ, ప్రాంఛైజీలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. అదే విధంగా అధిక ఆదాయం లభిస్తోంది. అలా వచ్చిన డబ్బును బీసీసీఐ దేశవాళీ క్రికెట్ కోసం ఉపయోగిస్తోంది. దాంతో భారత్లోని ప్రతిభగల యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అలా వచ్చిన ఆటగాళ్లు ఇప్పుడు టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్నారు' అని వసీం అక్రమ్ అన్నాడు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ళు తమ క్రికెట్ ప్రయాణాలను ఐపీఎల్ నుండి ప్రారంభించి.. ఆపై భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
పీఎస్ఎల్ కన్నా రెండింతల బడ్జెట్ ఎక్కువ
'ఐపీఎల్లో ఆటగాళ్లను కొనేందుకు ఒక జట్టు బడ్జెట్ రూ.60-80 కోట్లు ఉంటుంది. అది పీఎస్ఎల్ కన్నా రెండింతలు ఎక్కువ. ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు వ్యక్తిగత కోచ్లను ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా పూర్తిస్థాయిలో సన్నద్ధమై.. ఆత్మవిశ్వాసంతో ఆడతారు. ప్రాంఛైజీలు మాజీ క్రికెటర్లను కోచ్లుగా నియమించడం కూడా ఐపీఎల్లో ప్రతిభను వెలికి తీయడానికి సహాయపడింది. కోచ్లు ఆటగాళ్లను నిత్యం గమనిస్తారు కాబట్టి ప్లేయర్ మెరుగుపడేందుకు ఎంతో అవకాశం ఉంటుంది' అని పాక్ దిగ్గజ బౌలర్ అభిప్రాయపడ్డాడు. అక్రమ్ గతంలో కోల్కతా నైట్ రైడర్స్కు బౌలింగ్ కోచ్గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు పలు జట్లతో ఉన్న విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 19 నుంచి
సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తామని టోర్నీ పాలక మండలి చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. యూఏఈ వేదికగా జరనున్న ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే ఐపీఎల్ 2020 సీజన్ షెడ్యూల్లో ఓ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఫైనల్ తేదీని నవంబరు 8న (ఆదివారం) కాకుండా నవంబరు 10న (మంగళవారం) నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దీపావళి వారంలో ఫైనల్ జరుపాలని టోర్నీ బ్రాడ్కాస్టర్ స్టార్ ఇండియా కోరడంతో బీసీసీఐ ఆ దిశగా ఆలోచిస్తున్నది. పండుగ సమీపంలో ఫైనల్ జరిగితే వ్యూవర్షిప్ మరింత అధికంగా వస్తాయని బ్రాడ్కాస్టర్లు భావిస్తున్నారు.
రెండు వారాల్లో నాలుగు సార్లు
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న ఆరంభంకానున్న ఐపీఎల్ 2020 సీజన్ కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. భారత్ నుంచి ఐపీఎల్లో పాల్గొనేందుకు వెళ్లే ఆటగాళ్లకు రెండు వారాల్లో నాలుగు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఐపీఎల్ కోసం వెళ్లేముందు భారత్లో రెండు సార్లు.. యూఏఈలో క్వారంటైన్లో ఉన్నప్పుడు మరో రెండు సార్లు కరోనా పరీక్షలు చేస్తారు. యూఏఈలోకి వచ్చే ప్రతీ ప్రయాణికుడికి కరోనా పరీక్షలు తప్పనిసరి. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కూడా ఇదే రూల్ వర్తించనుంది. ఆటగాళ్లు, ఫ్రాంఛైజీ యజమానులంతా ఈ నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని బీసీసీఐ సూచించింది.
'ఇంగ్లండ్ క్రికెట్ ప్రయోజనం కోసం ఐపీఎల్ను ఓ వేదికగా ఉపయోగించుకుంటున్నాం'