లండన్: ఇంగ్లండ్ క్రికెట్, ఆటగాళ్లు ఎదిగేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మేం ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నాం అని ఆ దేశ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. ఐపీఎల్ లీగ్లో మాత్రమే ప్రపంచకప్కు సమానమైన ఒత్తిడి ఉంటుందని, ఆ ఒత్తిడికి అలవాటు పడేందుకే తాము 2019 ఎడిషన్లో ఆడామని వెల్లడించాడు. 2019 ఎడిషన్లో ఆడేందుకు నిర్ణయం తీసుకొనేందుకు ఈసీబీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ ఆండ్రూ స్ట్రాస్ను సంప్రదించినట్లు మోర్గాన్ చెప్పాడు.
క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో క్రిక్బజ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ...'ఐపీఎల్లో ఆడాలనేది ఆండ్రూ స్ట్రాస్ ప్రణాళిక. ఆ నిర్ణయం తీసుకొనేలా నేనే ఆయనపై ఒత్తిడి చేశాను. ఎందుకంటే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ తరహా ఒత్తిడి, పరిస్థితులు ద్వైపాక్షిక సిరీసుల్లో ఉండవు. అలాంటప్పుడు ఒత్తిడిని తట్టుకోవడం కష్టమవుతుంది' అని మోర్గాన్ అన్నాడు. 2015 ప్రపంచకప్లో ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం అవమానకరంగా భావించింది. దీంతో 2019 ప్రపంచకప్కి పక్కా ప్రణాళికలు వేసింది.
'ఐపీఎల్, ద్వైపాక్షిక సిరీసుల్లో తేడా ఏముంటుందని స్ట్రాస్ అడిగాడు. మొదట ఒక విదేశీ ఆటగాడిగా ఎక్కువ అంచనాలు ఉంటాయి. లీగ్ పరిస్థితులు, ఒత్తిడి భిన్నం. వాటిని తప్పించుకోవడం సాధ్యంకాదు. అంతేకాకుండా ఆటగాడు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాడు. అందుకే ఐపీఎల్ ఆడటం ప్రయోజనకరమని చెప్పాను. లీగ్తో మా ఆలోచనా ధోరణి మారింది. భారత క్రికెట్ మాకు అండగా ఉంటుందని భావిస్తున్నా. ఎందుకంటే ఆటగాళ్లు ఎదిగేందుకు ఐపీఎల్ను మేం ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నాం' అని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు.
'ఈసీబీలో ఆండ్రూ స్ట్రాస్ నియామకం చాలా ముఖ్యమైన విషయం. ఇంగ్లీష్ క్రికెట్లో ఎంతో పురోగతి వచ్చింది. ఆయన చాలా విషయాలపై ప్రభావం చూపాడు. 2015లో ఉన్న పరిస్థితులకు 2019 పరిస్థితులకు చాలా తేడా వచింది. ప్రతి ఒక్క ఆటగాడి సమస్యను పోగొట్టాడు. అతడు రావడం జట్టులో ఉత్సహం పెరిగింది. వన్డే క్రికెట్ మరియు టెస్ట్ క్రికెట్లో ఎంతో తేడా వచ్చింది' అని ఇంగ్లీష్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ కెరీర్లో మోర్గాన్ ఇప్పటివరకు 16 టెస్టుల్లో, 237 వన్డేల్లో, 89 టీ20 మ్యాచ్ల్లో ఇంగ్లీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
మరోసారి వార్తల్లో శుభ్మన్-సారా.. ఇద్దరిమధ్య సంథింగ్.. సంథింగ్!!