లక్నో: సూర్యకుమార్ యాదవ్ కోసం తన వికెట్ను త్యాగం చేశానని టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ఆటలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సహజమని తెలిపాడు. న్యూజిలాండ్తో ఆదివారం ఉత్కంఠగా సాగిన లోస్కోరింగ్ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే సూర్య కారణంగా వాషింగ్టన్ సుందర్ రనౌటయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించిన సూర్యను సుందర్ వారించినా పట్టించుకోలేదు. చివరకు సూర్య కోసం సుందర్ తన వికెట్ను త్యాగం చేశాడు.
మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించిన సుందర్.. ఇలాంటి ఘటనలు కామన్ అని చెప్పాడు. 'మాతోపాటు స్టేడియంలో, టీవీల్లో వీక్షించిన అభిమానులు.. అలాగే మీరు (కామెంటేటర్లు) కూడా ఉత్కంఠను అనుభవించారు. మ్యాచ్లో విజయం సాధించే వరకు కుదురుగా ఉండలేకపోయాం. ఇలాంటి పిచ్పై ఆడటం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అన్ని జట్లూ ఇతర దేశాలకు పర్యటించినప్పుడు కావాల్సినన్ని బౌలింగ్ వనరులతో వస్తాయి.
అయితే ఇలా ఎక్కువగా స్పిన్ పిచ్ల మీద ఆడేటప్పుడు నైపుణ్యమంతా ప్రదర్శించాల్సి ఉంటుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చివరికి విజయం సాధించడం ఆనందంగా ఉంది. ఇక మ్యాచ్లో రనౌట్లు జరగడం సర్వసాధారణం. అయితే క్రీజ్లో సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ ఉండటం చాలా ముఖ్యమనిపించింది.'అని సుందర్ తెలిపాడు.
సూర్య కూడా రనౌట్ విషయంలో తనదే తప్పని అంగీకరించాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపాడు. 'నాలో విభిన్నమైన కోణాన్నిఈ మ్యాచ్లో చూశారు. నేను బ్యాటింగ్కు వచ్చినప్పుడు పరిస్థితులను అందిపుచ్చుకోవడం ముఖ్యమని భావించాను. వాషింగ్టన్ సుందర్ ఔటైన అనంతరం ఒకరు ఇన్నింగ్స్ ముగిసే వరకు క్రీజులో ఉండటం ముఖ్యమనిపించింది. సుందర్తో సమన్వయ లోపం, రనౌటవ్వడంలో నాదే తప్పు. నేనే పరుగు తీయాల్సింది కాదు. బంతిని చూసుకోకుండా లేని పరుగుకోసం ప్రయత్నించాను.
ఈ వికెట్ బ్యాటర్లకు సవాల్ విసిరింది. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇంత టర్న్ ఉంటుందని మేం ఊహించలేదు. కానీ పరిస్థితులను అందిపుచ్చుకొని బ్యాటింగ్ చేశాం. చివరి ఓవర్లో ఒక్క షాట్ ఆడితే చాలనుకున్నాం. ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని భావించాం. విన్నింగ్ షాట్ ఆడే ముందు ఈ బంతికే మ్యాచ్ను ముగించేసేయ్ అని హార్దిక్ చెప్పాడు. అది నా ఆత్మవిశ్వాసాన్ని ఆమాంతం పెంచింది.'అని సూర్య తెలిపాడు.