

హైదరాబాద్: సోషల్ మీడియాల పుణ్యమాని సెలబ్రిటీలు సాధారణ అభిమానికి సైతం అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యమైన ఈవెంట్లతో పాటు సరదా సంభాషణల్లో సైతం పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ నెటిజన్లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. 'ఆస్క్ లక్ష్మణ్' పేరిట.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
లార్డ్స్లో దాదా చొక్కా విప్పినప్పుడు వెంటనే మీరెలా ఫీలయ్యారంటూ ప్రశ్నను సంధించారు. దానికి సమాధానంగా మొదట షాకయ్యానని.. కాసేపు గడిచిన తర్వాత గంగూలీ అలా ఎందుకు చేశాడో అర్థమైందని వీవీఎస్ సమాధానం చెప్పారు. కాసేపయ్యాక తేరుకుని గంగూలీ అలా ఎందుకు చేశాడో అర్థమైందన్నారు. భారత్లో ఆడిన ప్రస్తుత తరం క్రికెటర్లలో స్టీవ్ స్మిత్ ఆటతీరు తనకు బాగా నచ్చిందని లక్ష్మణ్ చెప్పారు.
పుణేలో అతడు చేసిన సెంచరీ.. విదేశీ ఆటగాడు భారత గడ్డ మీద చేసిన సెంచరీల్లో ఉత్తమమైన వాటిల్లో ఒకటని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. నెటిజన్లతో సరదాగా ముచ్చటిస్తున్న లక్ష్మణ్కు క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సరదా ప్రశ్న వేశాడు. సార్.. మసాజ్ టేబుల్ ధర ఎంత ఉంటుందని అడిగాడు. దీనికి వీవీఎస్ బదులిస్తూ.. ఎవరు ప్రశ్న అడుగుతున్నారో చూడండి. నువ్వు మసాజ్ టేబుళ్ల మీద పడుకున్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. అన్ని రకాల మసాజ్ టేబుళ్ల ధరలు నీకు కచ్చితంగా తెలిసి ఉంటాయంటూ.. లక్ష్మణ్ అంతే సరదాగా బదులిచ్చారు.
సిడ్నీలో చేసిన 167 పరుగులు, ఈడెన్ గార్డెన్స్లో చేసిన 281 పరుగులు తనకు ఎంతో ప్రత్యేకమని లక్ష్మణ్ చెప్పారు. సిడ్నీలో చేసిన సెంచరీయే టెస్టుల్లో తాను చేసిన తొలి టెస్టు సెంచరీ అని లక్ష్మణ్ చెప్పారు. ఈ మధ్యన చేసిన ట్వీట్లో లక్మణ్.. క్రికెట్ మైదానంలో ఉండగా తాను ప్రశాంతతను ఎప్పుడూ కోల్పోలేదని చెప్తూనే నిజమే కదా అని ప్రశ్నించాడు. దానికి బదులిచ్చిన నెటిజన్లంతా మొహాలీ వేదికగా ఎపిక్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రగ్యాన్ ఒజాపై కోల్పోయావంటూ సమాధానాలిస్తున్నారు.